అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే: కాంగ్రెస్, బీఆర్ఎస్కు కిషన్ రెడ్డి కౌంటర్
కేంద్ర బడ్జెట్ను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అవినీతి అసమర్థతతో పాలన చేతకాక కాంగ్రెస్, బీఆర్ఎస్లు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామన్నారు.
కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం గత పదేళ్లలో రూ.10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందని కిషన్రెడ్డి వెల్లడించారు.

పన్నుల వాటాలో రూ.2 లక్షల కోట్లు రాష్ట్రానికి కేంద్రం బదిలీ చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. వాటిని దారిమళ్లించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చే ఫండ్స్ను కూడా దారి మళ్లించారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి ఆ నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. పునర్విభజన చట్టం కింద కేంద్రం అనేక హామీలు అమలు చేసిందన్నారు.
రామగుండంలో విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశామని కిషన్రెడ్డి తెలిపారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. గిరిజన వర్సిటీ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందిని గుర్తుచేశారు. జీఎస్టీ పరిహారం కింద రూ.7 వేల కోట్లు అందజేశామని తెలిపారు. జాతీయ రహదారుల కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీల రూపంలో రూ. 7వేల కోట్లు ఇచ్చిందని
కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే ప్రస్తుత సీఎం రేవంత్ నడుస్తుండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్ నేతలు అసమర్థత నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇలా కేంద్రం మీద బురద చల్లుతున్నారని మండిపడ్డారు.
పంచాయతీరాజ్ సంస్థల నిధులిస్తే కనీస అవసరాలు, మౌలికవసతుల కల్పనకు ఈ నిధులు వెచ్చించకుండా పక్కదారి పట్టించారని ఆరోపించారు.
శాసనసభను పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం కోసం, నరేంద్ర మోడీని విమర్శించడం కోసం నడిపారని ధ్వజమెత్తారు. తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం చూస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోడీని విమర్శించినంత మాత్రన మీ అసమర్థత నుంచి తప్పించుకుంటామనేది పొరపాటు అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications