ఈ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయమే, అడ్డుకుంటాం: కేసీఆర్పై కిషన్ ఫైర్
కేంద్ర ప్రభుత్వాన్ని కించపర్చేలా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాన్ని కించపర్చేలా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
అవసరమైతే అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తన పరిధులు దాటి మతపరమైన రిజర్వేషన్లను తీసుకొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రజలను సంఘటితం చేసి ఉద్యమిస్తామని ఆయన తెలిపారు.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించి తీరుతామని, దీనిపై శాసనసభలో చట్టం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని... కేంద్రం సరిగా స్పందించకపోతే యుద్ధం తప్పదని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి పై విధంగా స్పందించారు.
ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజలను విభజించి పాలిస్తున్నారంటూ కేసీఆర్పై మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము పూర్తిగా వ్యతిరేకమని, కేసీఆర్ ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు.