కేసీఆర్ను గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు: కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు
హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
గజ్వేల్లో 114 మంది ధరణి బాధితులు నామినేషన్ వేశారని.. కామారెడ్డిలోనూ 58 మంది నామినేషన్ దాఖలు చేశారని కిషన్ రెడ్డి చెప్పారు. వారందర్నీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ తరపున 39 మంది బీసీలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందన్నారు.

ఇక బీఆర్ఎస్ కూడా 23 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ మాత్రమే బీసీల గురించి ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. గజ్వేల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రకటించగానే.. కేసీఆర్ భయపడ్డారని అన్నారు. అందుకే గజ్వేల్ నుంచి కామారెడ్డికి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఈసారి గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓడిపోతారని కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఈ ఎన్నికల్లో ఓడిపోతారని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ను కామారెడ్డిలో గెలిపించాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్ను గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. గజ్వేల్, కామారెడ్డిలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు.
కేసీఆర్ మాటలే కోటలు దాటుతాయంటూ ఈటల విమర్శలు
బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కరీంనగర్ జిల్లాలో ప్రచారం చేసిన ఈటల రాజేందర్కు వీణవంక మండలంలోని ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మాటలతో కోటలు కడతారు తప్ప.. మన సమస్యలు తీర్చరని విమర్శించారు.
రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి.. నేడు గంగపాలైందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తోందని.. ఇప్పటివరకు ఎంత మంది యువతకు ఉద్యోగం కల్పించారని ప్రశ్నించారు. ఇచ్చే రెండు వేల ఫించన్ వల్ల బతుకులు బాగుపడవని.. మన పిల్లలకు ఉద్యోగాల కల్పన జరిగితే అదే పదివేలన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.












Click it and Unblock the Notifications