బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కిషన్ రెడ్డి, జలగం వెంకట్రావుతో మాజీ సీఎం భేటీ
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ను కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలిశారు. శుక్రవారం హనుమకొండలోని ఆయన నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. రాజ్యసభ సీటు ఆశించినా.. దక్కకపోవడంతో సీతారాం నాయక్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు.
ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి.. సీతారాం నాయక్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీతారాం నాయక్ను బీజేపీలోకి రావాలని కిషన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది.

తాను ట్రైబల్ వర్సిటీ ప్రారంభోత్సవానికి వచ్చానని.. అలాగే సీతారామ్ నాయక్ను కలిశానని కిషన్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే గిరిజన వర్సిటీ కోసం గతంలో ఆయన ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. మంచివారు ఎవరు బీజేపీలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు. సీతారామ్ వంటి వారిని తీసుకోవడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. బీజేపీలోకి వస్తారా? రారా? అన్నది ఆయన తేల్చుకోవాలన్నారు.
కాగా, సీతారాం నాయక్కు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితకు మరోసారి అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న సీతారామ్ నాయక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
జలగం వెంకట్రావుతో బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత జలగం వెంకట్రావుతో ఏపీ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయనను బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి ఖమ్మం లోక్ సభ సీటును ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు జలగం వెంకట్రావు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఆయన బీజేపీలో చేరితే ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications