అసెంబ్లీలో నోట్ల రద్దు: 'ఆడవారి బంగారం జోలికి మోడీ ప్రభుత్వం వెళ్లదు'
నోట్ల రద్దు వల్ల ఉన్న లాభాలను కిషన్ రెడ్డి అసెంబ్లీలో ఏకరువు పెట్టారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు ఉన్న భవిష్యత్తు బాగుంటుందన్నారు.
హైదరాబాద్: నోట్ల రద్దుతో ఎన్నో లాభాలు ఉన్నాయని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి శక్రవారం చెప్పారు. శాసన సభలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల ఉన్న లాభాలను ఆయన ఈ రోజు ఏకరువు పెట్టారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు ఉన్న భవిష్యత్తు బాగుంటుందన్నారు.
పన్నుల రూపేనా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ధరలు తగ్గుతాయన్నారు. తక్కువ వడ్డీకే రుణాలు దొరుకుతాయని చెప్పారు. డిజిటల్ లావాదేవీలపైన ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. ప్రజల ఇబ్బందుల వెనుక వారికే లాభాలు ఉన్నాయన్నారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ప్రయోజనాల కోసం తీసుకున్నదని చెప్పారు. స్వార్థ నిర్ణయం కాదన్నారు.
నోట్ల రద్దు వల్ల అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని, ఈ సమస్య 50 రోజులు ఉంటుందని ప్రధాని మోడీ ముందే చెప్పాలన్నారు.

నల్లధనాన్ని నియంత్రించేందుకు తీసుకున్న అసాధారణ నిర్ణయంపై ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో పేదవాడు తొలిసారి నవ్వుతున్నాడన్నారు.
నల్లధనాన్ని నియంత్రిస్తే ప్రతి పేదవాడికి సొంతిల్లు కట్టించొచ్చని, ధరలను అదుపులో ఉంచొచ్చన్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రారంభంలో ఇబ్బందులు కలగడం సహజమేనని, అవన్నీ త్వరలోనే తొలగిపోతాయన్నారు.
ఆడవారి బంగారం జోలికి కేంద్రం వెళ్లదు
ఆడవారి బంగారం పైన కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మహిళల బంగారం జోలికి కేంద్రం వెళ్లడం లేదన్నారు.
అంతకుముందు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రూ.500, రూ.1000 నోట్ల రద్దును తమ ప్రభుత్వం సమర్థిస్తోందన్నారు. అవినీతి పైన కేంద్రం చేస్తున్న యుద్ధం నెరవేరాలన్నారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు ఉన్నాయని, వాటిని తీర్చాలని తాము కేంద్రానికి, ఆర్బీఐకి లేఖ రాశామని చెప్పారు.












Click it and Unblock the Notifications