మీ తాటాకు చప్పుళ్లకు భయపడం, అబద్ధాలు ఆపండి: కేసీఆర్కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని అన్నారు. ధాన్యం సేకరణకు కేంద్రం చేపట్టిన చర్యలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్ సోమవారం నిర్వహించిన మీడియా సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ నేతలపైనా ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణపై రూపాయి భారం లేదు: కిషన్ రెడ్డి
ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భయపెడితే బీజేపీ కార్యకర్తలు, కేంద్ర ప్రభుత్వం భయపడదని కేసీఆర్కు కౌంటర్ ఇచ్చారు. 2014లో ప్రధాని మోడీ ప్రభుత్వం రాక ముందు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని, కానీ, బీజేపీ ప్రభుత్వం 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని తెలిపారు. 2014లో తెలంగాణలో 43 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించారని, ఇప్పుడు తెలంగాణలో 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ధాన్యం సేకరణకు కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు. రైతుల గన్నీ సంచులకు కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులిస్తోందని చెప్పారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వంపై రూపాయి కూడా భారం పడదని అన్నారు. పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ నుంచే ధాన్యం సేకరణ జరుగుతోందని చెప్పారు. పంజాబ్ నుంచి 135 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే, తెలంగాణ నుంచి 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.

అబద్ధాలు, బాధ్యతా రాహిత్యం: కేసీఆర్పై కిషన్ ఫైర్
తెలంగాణలో బాయిల్డ్ రైస్ ఎవరూ తినరని, దేశంలో బాయిల్డ్ రైస్ ఉపయోగం లేదని కేంద్రమంత్రి చెప్పారు. రైతులు కూడా బాయిల్డ్ రైస్ పండించరని, దాన్ని ఉత్పత్తి చేసేది మిల్లర్లేనని అన్నారు. రా రైస్ ఇస్తే ఎంతైనా తీసుకుంటామన్నారు. గత సంవత్సరం 44.75 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని కేంద్రం తీసుకుందని, రాబోయే రోజుల్లో దొడ్డు బియ్యాన్ని తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. అన్ని రైస్ మిల్లుల్లో రా రైస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ధాన్యం ఉత్పత్తిని సరిగా అంచనా వేయలేకపోతోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సెప్టెంబర్ 29న లేఖ రాశారని, కంటి చూపుతో అంచనా వేసినట్లు ఆ లేఖలో తెలిపారని చెప్పారు. సర్వే అంచనా, సర్వే లేకుండా బాధ్యతారహితంగా లేఖ రాశారని మండిపడ్డారు. ధాన్యాన్ని ప్రతి సంవత్సరం కూడా కేంద్రమే కొనుగోలు చేస్తోందన్నారు. ధాన్యం సేకరణకు కేంద్రం రూ. 26,640 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. 2014లో ఉన్న రూ. 3400 కోట్ల నుంచి రూ. 26,640 కోట్లకు పెంచామని తెలిపారు. 41 లక్షల మెట్రిక్ టన్నులకే ఒప్పందం చేసుకున్నారని, ఇప్పుడేమో 108 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు సేకరించాలంటున్నారని కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Recommended Video

భయపడేది లేదు, కేసీఆర్వి అబద్దాలే: కిషన్ రెడ్డి ఫైర్
ధర్నాలు చేస్తే, నాలుకలు చీరుస్తామంటే భయపడేది లేదంటూ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లేనిపోని మాటలు చెప్పి రైతులను తప్పుదోవపట్టించొద్దంటూ కేసీఆర్కు హితవు పలికారు. ఢిల్లీలో ధర్నాలు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు.. ఏం చేసినా ఎవరూ భయపడరని అన్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలు వద్దని తెలంగాణ ప్రభుత్వమే చెప్పిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సరైన అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెట్రోల్ విషయంలో కూడా అబద్ధాలు చెబుతున్నారన్నారు. రూపాయి కూడా అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయన్నారు. జీఎస్టీ ఆదాయం పడిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో సెస్ పెంచామని, ఆ ఆదాయం మెరుగుపడిందనే ధరలు తగ్గించే ప్రయత్నం చేశామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించామని చెప్పారు. కేంద్రానికి అనేక రకాలుగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. 80 కోట్ల మందికి ఏడాదిపాటు రేషన్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. అంతేగాక, దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు ఇస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు సహకరిస్తాయన్నారు. కేసీఆర్ అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, సోమవారం మీడియా సమావేశంలో కేసీఆర్.. కేంద్రం, రాష్ట్ర బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ గెలుపుతో కేసీఆర్లో ఫ్ట్రస్టేషన్ ఎక్కువైందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ.. కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ఎక్కువగా ఉందని తెలిపారు. కేంద్రం తగ్గించినా కేసీఆర్ సర్కారు మాత్రం తగ్గించడం లేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications