హిందూవ్యవస్థను దెబ్బతీసే కుట్ర: కిషన్, చంద్రబాబుకు సూచన
చిత్తూరు: దేశంలో హిందూ వ్యవస్థను, భారతీయ సంస్కృతిని దెబ్బ తీసేందుకు విదేశీ శక్తులు చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నాయని, వాటిని అందరూ తిప్పి కొట్టాలని తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి శుక్రవారం నాడు అన్నారు.
ఉదయం ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో మతమార్పిడులు ఎక్కువయ్యాయని, వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మఠాధిపతులు, పీఠాధిపతులపై ఉందన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలన్న టిటిడిపి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. మంచి వర్షాలు కురవాలని, ఇప్పుడున్నటువంటి కరవు నుంచి తట్టుకునే శక్తిని ప్రజలకు, అలాగే కరవు సహాయక చర్యలు చేపడుతున్న ప్రభుత్వాలపై దేవుడు దయ చూపాలని భగవంతుని ప్రార్థించానన్నారు.

శేషాచలానికి తలమానికమైన ఎర్రచందనం అటవీ సంపదను ఆర్థిక, వాణిజ్య దృష్టితో చూడకుండా వాటి పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. అంతరించిపోతున్న వృక్షాల్లో ఎర్రచందనం కూడా ఉందని, దీనిని ఐక్య రాజ్య సమితి ధృవీకరించిందన్నారు.
అలాంటి అరుదైన జాతిని భావితరాల కోసం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి వృక్షాల ఎగుమతితో డబ్బులు సంపాదించుకోవాలనే భావన సరికాదన్నారు. శేషాచలంలోని చెట్లను నరకకుండా రాష్ట్ర ప్రభుత్వం మరింత సత్వర చర్యలు చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications