అప్పుడు ఎన్టీఆర్ మరణానికి.. ఇప్పుడు పార్టీ..: బాబుపై ఫైర్, టీడీపీ కోసం జైలు కెళ్లానంటూ కిషన్
న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ దాదాపు ఖరారైన నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. ఇప్పుడు చంద్రబాబు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడంపై మండిపడ్డారు.
నాకు, కేసీఆర్కు మధ్య చిచ్చుపెట్టాలని చూశారు: మోడీపై ఫైర్, పొత్తులపై తేల్చేసిన బాబు
అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు టీడీపీ..
ఆనాడు ఎన్టీఆర్ను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఆయన సిద్ధాంతాలను కూడా కనుమరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటున్నారని విమర్శించారు.
బాబు నీచస్థాయికి దిగజారారు.. ఎన్టీఆర్ కోసం జైలుపాలయ్యా..
పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్వార్థ రాజకీయాలకోసం చంద్రబాబు ఎంత నీచస్థాయికైనా దిగజారతారని విమర్శించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంపై ఇందిరాగాంధీ చేసిన కుట్రలకు వ్యతిరేకంగా అప్పుడు బీజేపీ ఆందోళనలు చేసిందని, ఎన్టీఆర్కు మద్దతుగా తాను చేసిన ఆందోళనతో జైలుపాలయ్యానని కిషన్రెడ్డి గుర్తు చేశారు.
ఊరుకోరంటూ హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు కాబట్టి ఆనాడు తామందరం మద్దతు ఇచ్చామని, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలిస్తే తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకోరని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధమైన కాంగ్రెస్తో పొత్తు ఆలోచనలను చంద్రబాబు ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. లేకుంటే చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలను ప్రజలు క్షమించరని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
రజాకార్ల రాజ్యం తీసుకొస్తారా?.. కేసీఆర్పై ఫైర్
ఇక కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్టు తెలంగాణలో తాను కూడా ముఖ్యమంత్రిని అవుతానని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపైనా కిషన్ రెడ్డి స్పందించారు. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ప్రమాదకరమని, నిజాం నిరంకుశపాలనను ఆయన తిరిగి తెలంగాణలో తీసుకురావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీపై రజాకార్ల జెండా ఎగురవేస్తామని చెప్పే ధైర్యం ఎంఐఎంకు వచ్చిందంటే దానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని దుయ్యబట్టారు. మజ్లిస్తో కలిసి ఉన్న టీఆర్ఎస్తో బీజేపీకి ఎలాంటి పొత్తులు ఉండబోవని కిషన్రెడ్డి తేల్చి చెప్పారు. కాగా, కుమారస్వామిలా తాము కూడా సీఎం పదవి చేపడతామని అక్బరుద్దీన్ ఓవైసీ అనగా.. ఆయన సోదరుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, కేసీఆరే సీఎం అని వ్యాఖ్యానించడం గమనార్హం.