'కెసిఆర్ రెచ్చగొడ్తున్నారు', సిఎంకు-రసమయికి వ్యతిరేకంగా పాటలు
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, అంబర్ పేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్రేకాలను రెచ్చగొడుతూ కెసిఆర్ పబ్బం గడుపుకుంటున్నారన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఓ వైపు కరువు ఉందని, అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను ఆర్భాటంగా ప్రవేశ పెడుతోందని, అదే సమయంలో పాత పథకాలను వదిలేస్తోందని మండిపడ్డారు. ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు.
ప్రశ్నిస్తే అరెస్టులా
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేయిస్తారా అని తెలంగాణ కళాకారుల వేదిక నాయకులు కిషోర్, అశోక్ మంగళవారం ప్రశ్నించారు. దగాపడ్డ కళాకారుల సభ యాదగిరిగుట్టలో జరిగింది. ఈ సందర్భంగా వారు కెసిఆర్కు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్కు వ్యతిరేకంగా పాటలు పాడారు.
పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. వారు పోలీసు స్టేషన్ వద్ద ధూంధాం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము న్యాయం చేయమని అడిగితే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.
చెరువులు కబ్జాలకు పాల్పడితే చర్యలు
రాయదుర్గం చెరువును మంగళవారం నాడు అసెంబ్లీ అంచనాల కమిటీ పరిశీలించింది. చెరువులోని 60 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు కమిటీ గుర్తించింది.
రూ.1500 కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని కమిటీ చైర్మన్ రామలింగా రెడ్డి తెలిపారు. చెరువులు కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. కబ్జాలకు పాల్పడేవారి వివరాలు చెరువు వద్ద ప్రదర్శిస్తామని హెచ్చరించారు.