పతంగుల పండుగ షురూ.. కరోనా సమయంలోనూ సంక్రాంతి స్పెషల్ గాలిపటాలతో చిన్నారుల సందడే సందడి
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. రంగురంగుల గాలిపటాలతో చిన్నారులు సంబరాలు జరుపుకునే పండుగ. నింగికి నిచ్చెన వేసినట్టుగా గాలిపటాలను ఎగరేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మార్కెట్లో రంగురంగుల పతంగులు సందడి చేస్తున్నాయి.
సంక్రాంతి స్పెషల్ గాలిపటాలు .. తెలుగు రాష్ట్రాల్లో పతంగుల పండుగ షురూ
సంక్రాంతి వచ్చిందంటే చాలు అన్ని ప్రత్యేకతలే .. ముత్యాల ముగ్గులు, ప్రతి ఇంట్లోనూ ఘుమఘుమలాడే పిండివంటలు, బంధుమిత్రులతో ప్రతి ఇంట్లో జరిగే పండుగ వేడుకలు ఒకెత్తయితే, చిన్నారుల అందరూ ఎంతో ఇష్టంగా ఎగరేసే గాలిపటాల సందడి మరో ఎత్తు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కెట్లలో కూడా విభిన్న రకాల గాలిపటాలు దర్శనమిస్తాయి. ప్రజలకు సంక్రాంతి సమయంలో గాలిపటాలను ఎగురవేయడం పై ఉండే క్రేజ్ తో ప్రతి ఏడు హైదరాబాద్ వంటి మహానగరాలలో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కైట్ ఫెస్టివల్ ను కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా రద్దు చేశారు.
గాలిపటాలను ఎగరేస్తూ సంక్రాంతి సంబరాలు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగినప్పటికీ ఈసారి పండుగ సంబరాలు జరుపుకోవడంలో మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పండుగ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక గాలిపటాలను కొనుగోలు చేస్తున్న చిన్నారులు కూడా పతంగులు ఎగురవేస్తూ పండుగ జరుపుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాదులోని ధూల్ పేట, గుల్జార్ హౌస్, చార్మినార్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో పతంగుల దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు.
హైదరాబాద్ లో దుకాణాల వద్ద కొనుగోళ్ళ సందడి
హైదరాబాద్లోని గాలిపటాల విక్రేతలు మకర సంక్రాంతి పండుగకు ముందు మార్కెట్లలోకి వచ్చిన రంగురంగుల గాలిపటాలను విక్రయించడం ద్వారా ఈ సంవత్సరం మంచి వ్యాపారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మకర సంక్రాంతికి ఒక రోజు ముందు, ధూల్పేట్లోని దుకాణాలు ఆకాశంలో తేలియాడే వివిధ రంగులతో గాలిపటాలు, మాంజా మరియు స్కై లాంతర్లతో అలంకరించబడ్డాయి.
ధరలు పెరిగినా మంచి వ్యాపారం .. కొనుగోళ్ళ పై వ్యాపారుల ఆశాభావం
ముడిసరుకు ధరలు పెరగడంతో పతంగుల ధరలు పెరిగినా మంచి వ్యాపారం చేసేందుకు సానుకూలంగా ఉన్నారని, ప్రజలు బాగా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలోనూ పతంగులు కొనేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కోవిడ్ ముప్పు మధ్య తమ పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు అదనపు గాలిపటాలు కొనుగోలు చేస్తున్నారని కూడా వ్యాపారులు చెబుతున్నారు.
ధూల్ పేటలో స్పెషల్ పతంగులు .. అమ్మకాలపై వ్యాపారులు చెప్తుందిదే
ధూల్పేట్లో గాలిపటాలు చాలా ఫేమస్. అందుకే ప్రజలు ఎక్కువగా ధూల్ పేట లో గాలిపటాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సాధారణంగా ప్లాస్టిక్ పేపర్ తో తయారు చేసిన గాలిపటాలు గుజరాత్, పూణే ల నుండి దిగుమతి చేసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్లో పేపర్ గాలిపటాలు మాత్రమే తయారు చేస్తారు, ఈసారి గాలిపటాల తయారీలో ఉపయోగించే కాగితం మరియు కర్రల ధర చాలా ఎక్కువగా ఉన్నకారణంగా గాలిపటాల ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ తయారు చేయబడిన గాలిపటాలు నాణ్యతలో ఉత్తమమైనవని, దానిపై ఉత్తమమైన డిజైన్లను ముద్రించారని వ్యాపారులు చెబుతున్నారు.
Recommended Video
ఒక రూపాయి మొదలుకుని 500 రూపాయల వరకు గాలిపటాల ధరలు
హైదరాబాద్లోని ధూల్పేటలో పతంగులను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక రూపాయి మొదలుకుని 500 రూపాయల వరకు గాలిపటాల ధరలు ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాదులో గాలిపటాలను కొనుగోలు చేయడానికి ఎంతో మంది ఆసక్తిగా వస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి ఉన్న సమయంలో కూడా ప్రజలు సంక్రాంతి సంబరాలను, గాలిపటాలను ఎగరేస్తూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.