ఆ ఒక్కటీ తప్ప! ప్రభుత్వంతో చర్చలకు రండి: ఆర్టీసీ సంఘాలకు కేకే పిలుపు, అశ్వద్ధామరెడ్డి ఏమన్నారంటే?
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 10వ చేరింది. సమ్మె ఉధృతంగా సాగుతోంది. ప్రైవేటు వ్యక్తులతో బస్సులు నడుపుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతున్నాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
19న తెలంగాణా బంద్ కు జనసేన మద్దతు ... ఆర్టీసీ కార్మికులకు అండగా పవన్
ఆ ఒక్కటీ తప్ప..
ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఓ ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన మిగితా డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
చేయి దాటక ముందే..
పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తమను తీవ్రంగా బాధించాయని, బలిదానాలు సమస్యలకు పరిష్కారం కాదని కేశవరావు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉందని తెలిపారు.
కేసీఆర్ ప్రకటన స్వాగతిస్తున్నా..
ఆర్టీసీ కార్మికుల వేతనాల్లో 44శాతం ఇంక్రిమెంట్, 16శాతం ఐఆర్ ప్రభుత్వం ఇచ్చిందని కేశవరావు గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించబోమన్న సీఎం కేసీఆర్ ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఆర్టీసీలో 50 శాతం సొంత బస్సులు, 30 శాతం స్టేజ్ క్యారియర్లు, 20 ప్రైవేట్ వాహనాలు అని సీఎం చేసిన ప్రతిపాదనలు.. ప్రస్తుత సమ్మెను దృష్టిలో పెట్టుకుని చేసినవేనని భావిస్తున్నట్లు తెలిపారు.
విధానపరమైన నిర్ణయం.. శాసించలేరు..
ప్రభుత్వ రంగ సంస్థల విలీనమంటే విధి విధానాలను మార్చుకోవాలని కోరడమేనని కేశవరావు అన్నారు. విధాన పరమైన నిర్ణయాల్లో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఎవరూ శాసించలేరని వ్యాఖ్యానించారు. తాను టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ కమిటీకి ఛైర్మన్గానూ వ్యవహరించానని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో లేదని స్పష్టం చేశారు.
అశ్వద్ధామరెడ్డి ఏమన్నారంటే..
ఇది ఇలావుంటే, ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే తాము వెళతామని ఆర్టీసీ యూనియన్ నేత అశ్వద్ధామ రెడ్డి అన్నారు. గవర్నర్ను కలిసి తమ సమస్యలను వివరించామని, గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. సమ్మె వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని చెప్పారు. సమ్మెపై టీఎన్జీవోలకు సమాచారం ఇవ్వలేదని అనడం సరికాదన్నారు. ఆర్టీసీ, ప్రభుత్వం మధ్య కేశవరావు మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ సీఎం కేసీఆర్ నిజామాబాద్ బహిరంగ సభలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.