యాంటీ కేసీఆర్ ఫోర్స్-ఐక్య వేదిక దిశగా-ఈటలకు కోదండరాం ప్రతిపాదన..?-చివరి ప్రయత్నంగా...
మాజీ మంత్రి ఈటల రాజేందర్కు నైతిక మద్దతు తెలిపేందుకే ఆయనతో భేటీ అయ్యామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. తాజా సమావేశంలో రాజకీయాల గురించి చర్చించ లేదని చెబుతూనే... 'యాంటీ కేసీఆర్ ఫోర్స్' ఆలోచన చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈటల బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమేనని ప్రచారం జరుగుతున్న వేళ... కోదండరాం చివరి ప్రయత్నంగా ఆయనతో 'ఐక్య వేదిక'పై చర్చించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్కు కొండా సూటి ప్రశ్న...
ఈటల రాజేందర్కు నైతిక మద్దతు ఇచ్చేందుకే ఇవాళ ఆయనతో భేటీ అయ్యామని... రాజకీయ అంశాలేవీ చర్చించలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈటలతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఆలయ భూములు,అసైన్డ్ భూములను ఈటల ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నప్పుడు... పార్టీ నుంచి ఆయన్ను ఎందుకు బహిష్కరించట్లేదని సీఎం కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో రాజకీయ అంశాలను పక్కనపెట్టాలని.. కక్ష సాధింపు చర్యలకు ఇది సమయం కాదని సూచించారు.యాంటీ కేసీఆర్ ఫోర్స్ ఏర్పడాలని అందరిలోనూ ఉందని అభిప్రాయపడ్డారు. ఈటలతో పాటు తాము అది జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత కోవిడ్ తరుణంలో దానికి పెద్ద తొందరేమీ లేదన్నారు.
కేసీఆర్ తీరు అంతే.. విబేధిస్తే విద్వేషమే : కోదండరాం
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ... 'రాజకీయ విభేదాలు ఉంటే చర్చించుకోవాలి. కానీ కేసీఆర్ ప్రజాస్వామిక పద్దతులను పాటించడు. అంతా ఆయన చెప్పినట్లుగా వినాలె... నీడగా బతకాలే... విబేధిస్తే విపరీత విద్వేషం చూపిస్తాడు.. ఆర్థికంగా,రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూస్తాడు. పిల్లలపై కేసులు పెట్టడమేంటి. ఎంత దురదృష్టమంటే... ఓపక్క ప్రజలకు వైద్యం దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. జూడాలు తమకు రక్షణ లేదని సమ్మె చేస్తుంటే... ఆ సమస్యలను పరిష్కరించట్లేదు. ప్రతిపక్షాలను కూడా కలుపుకుని వెళ్లి కోవిడ్పై పోరాడాల్సిన సమయంలో రాజకీయ కక్షలతో కాలం గడుపుతున్నారు. ఈటల కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధించడం సరికాదు.' అని కోదండరాం పేర్కొన్నారు.
యాంటీ కేసీఆర్ ఫోర్స్... ఐక్య వేదిక ప్రతిపాదన...?
ఈటల ఎపిసోడ్ను తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడిగానే తాము చూస్తున్నామని కోదండరాం అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు,ప్రభుత్వ విధానాలు,జరుగుతున్న అనర్థాలపై ఈటలతో చర్చించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని... అయితే ఆ పోరాటం ఏ రూపం తీసుకుంటుందనేది తాజా భేటీలో చర్చకు రాలేదని చెప్పారు. నిజానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైపోయిందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే చివరి ప్రయత్నంగా కోదండరాం ఈటల ముందు 'ఐక్య వేదిక' ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరినా మరో పార్టీలో చేరినా వారి లైన్లోనే పనిచేయాల్సి ఉంటుందని కోదండరాం నొక్కి చెప్పినట్లు సమాచారం. అదే సొంత వేదిక పెట్టుకుని పోరాడితే ఎవరి ఒత్తిళ్లు ఉండవని,సొంత మార్గనిర్దేశం ప్రకారం పనిచేయవచ్చునని కోదండరాం సూచించినట్లు తెలుస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే అదే ఉత్తమమని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కమలం వైపు ఈటల...?
కోదండరాం ప్రతిపాదనపై ఈటల రాజేందర్ ఇప్పటికిప్పుడు మనసు మార్చుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఏ పార్టీలో చేరకుండా అన్ని పార్టీల మద్దతు కూడగట్టి హుజురాబాద్లో ఉపఎన్నికను ఎదుర్కోవాలని ఈటల భావించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటి నుంచి మద్దతు కూడగట్టుకుని ఉపఎన్నికలో విజయం సాధించడం అసాధ్యమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు,అనుచరులతో సంప్రదింపుల మేరకు చివరకు బీజేపీలో చేరేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీసీ నాయకత్వంలో ముందుకు వెళ్తున్న బీజేపీలోకి ఈటల లాంటి మరో బలమైన బీసీ నేత వస్తే రాష్ట్రంలో మెజారిటీ వర్గం పార్టీ వైపు నిలుస్తుందని కమల దళం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కేసీఆర్ను సులువుగా ఎదుర్కోవచ్చునని ఈటలతో బీజేపీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.
Recommended Video