చేతకాకుంటే దిగిపోండి: కెసిఆర్ ప్రభుత్వంపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం టిఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలురాబట్టలేదని అన్నారు. ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నం ఒక్కటీ జరగలేదని, వ్యవసాయం, కుల వృత్తుల విధానాలపై అధ్యయనమే మొదలవలేదని విమర్శించారు.
ప్రజలకు ఫలితాలు ఎప్పుడు అందుతాయి? అని ప్రశ్నించారు. ప్రజలు బాగుండాలనేది తమ అంతిమ లక్ష్యమని, ఆ సోయి ఉండబట్టే ఇంకా నిలబడ్డామని చెప్పారు. లేకపోతే ఈపాటికి సంస్థను ఎప్పుడో పార్టీలో కలిపేసి వాళ్ల వెనక తిరిగేవాళ్లమని అన్నారు. ప్రభుత్వానికి చేతగాక పోతే దిగిపోవాలని, తాము చేసి చూపిస్తామని కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ తన అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా పయనించినప్పుడే లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని స్పష్టంచేశారు. ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు జి రవీందర్రావు ఆధ్వర్యంలో 'రెండేళ్ల తెలంగాణ- ప్రజా ఆకాంక్షలు- ప్రభుత్వ తీరుతెన్నులు' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా 'రెండేళ్ల టీఆర్ఎస్ పాలన-ఒక పరిశీలన' పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. కేవలం హైదరాబాద్ చుట్టూనే తిరుగుతూ మిగతా జిల్లాలను విస్మరిస్తే ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదన్నారు. అత్యధిక మంది ఆధారపడే వ్యవసాయ రంగం, సూక్ష్మ పరిశ్రమల అవకాశాలను పెంచి ఆర్థిక స్థోమత కల్పించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని, అందుకే తాము కోర్టులను ఆశ్రయించామన్నారు. పాలీహౌస్ వంటి వాటి వల్ల పేద రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. కుల వృత్తుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టత లేదని అన్నారు. విద్యను ఉచితంగా అందించి, ప్రజల రోగాలకు సరైన చికిత్సలు అందిస్తే తెలంగాణలో మూడోవంతు ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగే వరుస ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అది పనితీరుకు నిదర్శనం కాదని, కేవలం ప్రభుత్వంపై విశ్వాసంతోనే ప్రజలు ఓట్లు వేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు కాకుండా అంతా తమకే తెలుసునని సీఎం, మంత్రులు భావించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అలా భావిస్తే అది వారి అవివేకమే అవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీలోనే సభలు పెట్టుకోవద్దని డిక్టేట్ చేయడం సరికాదన్నారు. మల్లన్నసాగర్ కింద భూములు కోల్పోతున్న గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఉద్యమిస్తున్నా.. ఏ ఒక్క మీడియా బయటి ప్రపంచానికి చూపకపోవడం దురదృష్టకరమని సామాజిక వేత్త ఎన్ వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులు భవిష్యత్తులో ప్రజలకు గుదిబండగా మారుతాయని విద్యుత్ జేఏసీ నేత రఘు అన్నారు.