కిరణ్పై కోదండ, మాకే: ఏపీఉద్యోగులపై టీ ఎమ్మెల్యే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన సమైక్యవాది, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనుమరుగయ్యాడని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం అన్నారు.
ఉద్యమాలను అణచివేయడం అనేది ఎవరి తరం కాదని ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితమే నిలువెత్తు నిదర్శనమన్నారు. శనివారం మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల వారు ఏకతాటిపైకి వచ్చిన స్ఫూర్తితోనే ప్రజల సంక్షేమం, పథకాల అమలు కోసం ఉద్యమించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎవరి దయతోనో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, అలుపెరుగని పోరాటం, ఉద్యమ పంథా, సకల జనుల సమ్మె, బలిదానాల ఫలితంతో సాధించామన్నారు.
బంగారు తెలంగాణ సాధన కోసం మరింత కష్టపడాలన్నారు. నిరాధరణకు గురైన కొన్ని వర్గాల ప్రజలు స్వరాష్ట్ర సాధనతో తమ సమస్యలు తీరుతాయన్న ఆశలో ఉన్నారని, వారి ఆశలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని కోదండరామ్ చెప్పారు.
సరికాదు: శ్రీనివాస్ గౌడ్
ఏపీలో ఖాళీలు ఉన్నప్పటికీ తెలంగాణలో పని చేయాలని ఏపీ ఉద్యోగులు కోరుకోవడం సరికాదని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో అందరు టీ ఉద్యోగులే పని చేయాలని అందరు కోరుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగుల తాత్కాలిక విభజన తప్పుల తడక అన్నారు.