తెలంగాణ ఒకరి అయ్య జాగీరు కాదు: కేసీఆర్పై కోదండరాం ఫైర్
సిరిసిల్ల: తెలంగాణ సర్కారుపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తెలంగాణ ఒకరి అయ్య జాగీరు కాదు.. సర్కారు మనందరిది. మనం మీట నొక్కి ఓట్లు వేస్తేనే కుర్చీలో కూర్చున్నరు. తొవ్వ తప్పిన వారిని అడిగే అధికారం మనకుంది' అని అన్నారు.
ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం అమరవీరుల స్ఫూర్తి యాత్రను మూడు రోజుల పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలో ప్రారంభమైన యాత్ర ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, వేములవాడ, బోయిన్పల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో కొనసాగింది. కార్మికులు, రైతులు, మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటూ కొనసాగిన యాత్ర సోమవారం సిరిసిల్లలో ముగిసింది.
ఈ సందర్భంగా సిరిసిల్ల చేనేత చౌక్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోదండరామ్ మాట్లాడుతూ.. ఆంధ్రా పాలకులు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారని, తెలంగాణ వస్తే సిరిశాల అవుతుందని కార్మికులంతా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. అయితే, ఇప్పటి పాలకులు పెద్ద కంపెనీలపై దృష్టి పెడుతున్నారే తప్ప చేనేత, పవర్లూం పరిశ్రమలపై విధానాలను ఎందుకు రూపకల్పన చేయడం లేదని ప్రశ్నించారు.
సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు చేయూతనిస్తే సూరత్ కూడా పనికిరాదని అన్నారు. బీడీ కార్మికులకు జీఎస్టీ వల్ల నష్టం జరుగుతుందని, రాష్ట్రపతి ఎన్నికల్లో జీఎస్టీ రద్దు డిమాండ్ ఎందుకు పెట్టకూడదని సర్కారును ప్రశ్నించారు. మానేరు నదిని చూస్తే ఇసుక లోతుల్లోకి పోయిందని బోర్లు ఎండిపోయాయన్నారు. ఇసుకను అడ్డుకుంటే కేసులు పెడతున్నారన్నారు.
మిషన్ కాకతీయ పనుల్లో తెగిపోయిన చెరువులే దర్శనమిస్తున్నాయని అన్నారు. మన ఓట్లతో గెలిచిన సర్కారు తొవ్వ తప్పిందని, దాన్ని దారిలో పెట్టాల్సిందేనని పిలుపునిచ్చారు. మోరుదోపు కొల్యాగలను నాగలికి కట్టి దున్నినట్లే పాలకులను దారికి తేవాల్సిందేనని అన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలన్నారు. ప్రజల త్యాగాలకు బలిదానాలకు గుర్తింపు లేకుండా పోయిందని, మన ప్రభుత్వాన్ని దారిలో పెట్టడానికి జేఏసీలోకి రావాలని పిలుపునిచ్చారు.