కొత్త పార్టీకి కోదండరామ్ రెడీ: కెసిఆర్ టార్గెట్గా వ్యూహం ఇదీ...
కోదండరామ్ రాజకీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీకి ముందే పక్కా వ్యూహాన్ని ఖరారు చేసుకుంటారని అంటున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు టార్గెట్గా తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ స్థాపనకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వ్యూహరచన తెర వెనక జోరందుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ముందే ఖరారు చేసుకుంటారని తెలుస్తోంది.
కోదండరామ్ కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖులతో భేటీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్కు దూరంగా ఉంటూ వస్తున్న గ్రూపులు, వ్యక్తులను కూడా ఇందులో భాగస్వాములను చేసే వ్యూహం ఖరారవుతున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఫలాలు స్థానికులకు దక్కడం లేదనేది వారి ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంది. పార్టీలో కీలకంగా వ్యవహరించే వారు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాల నుంచి బయటకు వస్తారని అంటున్నారు. ఇందులో భాగంగానే జెఎసి చైర్మన్ పదవిని కోదండరామ్ వదులుకుంటారని చెబుతున్నారు.
పార్టీ రూపం ఎలా...
కోదండరామ్ పెట్టబోయే పార్టీలో ప్రజా సంఘాల పాత్ర ప్రముఖంగా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ జెఎసి కొనసాగుతుందని, అయితే అందులో కోదండరామ్ ఉండబోరని అంటున్నారు. విధానాల్లో భాగంగా ఆయన పార్టీ పదవి చేపట్టిన తర్వాత జెఎసి నుంచి తప్పుకుంటారని, పార్టీ పరంగా మాత్రం జెఎసి ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.
అందరూ ఒక్కటవుతారా...
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం ప్రభుత్వానికి దూరంగా ఉంటున్న ప్రజా సంఘాల నేతలు, ప్రముఖులు కోదండరామ్ పెట్టబోయే పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కోసం, తన కోసం పనిచేసినవారికి మాత్రమే కెసిఆర్ పదవులు, అవార్డులు ఇస్తున్నారని, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినవారిని విస్మరిస్తున్నారని ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ వచ్చింది కెసిఆర్ కోసం కాదనే వాదనను ముందుకు తెచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో ఆంధ్రులకే పెద్ద పీట...
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ఆంధ్రులకే పెద్ద పీట వేస్తున్నారని కోదండరామ్కు మద్దతు ఇస్తున్నవారు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులు చాలా వరకు ఆంధ్రులకే అప్పగించారనే ఆరోపణ ఉంది. దీనివల్ల తెలంగాణ కాంట్రాక్టర్లు కెసిఆర్ పట్ల అసంతృప్తితో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. వారంతా కోదండరామ్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ స్థితిలో కాంగ్రెసుతో సంబంధాలు ఎలా...
కాంగ్రెసుతో, తెలుగుదేశం పార్టీతో ఏ విధమైన సంబంధాలను పెట్టుకోవాలనే విషయంపై కూడా కోదండరామ్ పార్టీ విధానాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో స్థానం ఉండదని భావిస్తున్నారు. కాంగ్రెసు తిరిగి పుంజుకునే అవకాశం ఉందనే అంచనాతో ఉన్నారు. దీంతో కాంగ్రెసుతో ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటుకు లేదా పొత్తుకు సిద్ధపడాలనే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెసు కూడా పక్కా వ్యూహంతో...
కాంగ్రెసు పార్టీ కూడా పక్కా వ్యూహంతో మందుకు కదలాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అర్థమవుతోంది. వైరి వర్గాలు జానారా రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక్కటవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు అధికారంలోకి వస్తే జానా రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారంనాడు ప్రకటించారు. దీన్నిబట్టి కాంగ్రెసు నాయకులు గ్రూపులను పక్కన పెట్టి ఒక్కటయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ ఓ టీవీ చానెల్ను తీసుకున్నారు. ఓ పత్రికను కూడా పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.