ఉస్మానియాపై కెసిఆర్కు అండ: కోదండ ఎదుటే వైద్యుల వాగ్వాదం, వారించారు
హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి తరలింపు పైన వైద్యులు విడిపోయ, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు. అయితే, వారిని కోదండరామ్ వారించారు.
ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రిని తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోదండరామ్, ఇతర జెఏసి నాయకులు ఉస్మానియా ఆసుపత్రిన సోమవారం నాడు సందర్శించారు.
ఈ సందర్భంగా కోదండ మాట్లాడారు. ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్నారు. ఆసుపత్రి బాగు కోసం చేసే ఏ ప్రయత్నాన్ని అయినా తాము స్వాగతిస్తామని చెప్పారు. ఏం జరిగినా ఆసుపత్రి బాగు, పేదలకు వైద్యం అందడం ముఖ్యమన్నారు.
ఆసుపత్రి అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని ఆయ వైద్యులను కోరారు. ఉస్మానియాలో సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వల్లనే ఇలా ఉందన్నారు. ఆసుపత్రిని బాగు చేసేందుకు చూస్తే అందుకు సహకరించేందుకు సిద్ధమన్నారు.
ఆసుపత్రి మార్పు నేపథ్యంలో పరిష్కార మార్గాలు, ప్రత్యామ్నాయాల పైన దృష్టి సారిస్తామని చెప్పారు. ఆసుపత్రి బాగు విషయంలో భిన్నాభిప్రాయులు వద్దని చెప్పారు. కాగా, వైద్యుల నివాస నిర్మాణాల పైన స్పష్టత కావాలని కొందరు వైద్యులు చెప్పారు.
ఆసుపత్రి తరలింపుపై వైద్యుల్లో భిన్నాభిప్రాయాలు
ఆసుపత్రి తరలింపు పైన వైద్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వైద్యులు తరలించాలని, చంచల్ గూడకు తరలించాలని చెబుతున్నారు. మరికొందరు తరలింపును వ్యతిరేకిస్తున్నారు. చారిత్రక సంపదను కూల్చాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
కొందరు వైద్యులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కోదండకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిని బాగు చేస్తే సరిపోతుందన్నారు. ఆసుపత్రిలోని వైద్యుల సలహాలు తీసుకోకుండా బయటి వారి సలహాలు సరికాదన్నారు. ఈ సమయంలో వైద్యులు రెండు వర్గాలుగా విడిపోయి, వాగ్వాదానికి దిగారు. వారికి కోదండరాం సర్దిచెప్పారు.