'కేసీఆర్'కు కోదండరాం సీరియస్ వార్నింగ్: అదే చేస్తే.. హైదరాబాద్ అంతా ధర్నాలే!
ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ను తొలగించడం వల్ల ప్రజాస్వామ్యం మనుగడ కోల్పోతుందన్నారు. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని కోదండరాం గుర్తు చేశారు.
హైదరాబాద్: నగరంలోని ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ ను మరో చోటుకు తరలించాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తుండటంతో.. అందుకు వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, విపక్షాలు పోరాడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా చౌక్ ను అక్కడి నుంచి కదలనిచ్చేది లేదని తేల్చి చెబుతున్నాయి.
తాజాగా అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ వద్ద తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు మౌనదీక్ష చేపట్టి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా చౌక్ ను తొలగించడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్-19 కల్పించిన హక్కులను కాలరాయడమేనని అన్నారు.
ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ను తొలగించడం వల్ల ప్రజాస్వామ్యం మనుగడ కోల్పోతుందన్నారు. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని కోదండరాం గుర్తు చేశారు. ఇదే విషయంపై ఇప్పటికే తాము డీజీపీకి, కలెక్టర్లకు విజ్ఞప్తులు చేశామని తెలిపారు.
తమ నిరసనను, విజ్ఞప్తులను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకువెళ్తే.. నగరమంతా ధర్నా చౌక్ లు విస్తరిస్తాయని కోదండరాం హెచ్చరించారు. సర్కార్ దీనిపై సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఈ నెల 15న ధర్నా చౌక్ వద్ద కుల,మతాలకు అతీతంగా నిరసన తెలియజేస్తామని, ఇందుకోసం భారీ ఎత్తున జనం తరలిరావాలని పిలుపునిచ్చారు. గన్ పార్క్ వద్ద మౌనదీక్షలో కోదండరాంతో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.