కెసిఆర్పై కోదండరామ్ వార్: తెలంగాణలో ప్రతిపక్షం అదే...
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ధీటైన ప్రతిపక్షం లేదనే అభిప్రాయం బలంగా ఉంటూ వచ్చింది. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడంతో ఒక్కసారిగా తెలంగాణ సమాజం ఉలికి పడింది. రెండేళ్ల కెసిఆర్ పాలన ముగిసిన తర్వాత ఆయన గొంతెత్తారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇరువురికి మధ్య పలు సందర్బాల్లో విభేదాలు పొడసూపాయి. ఒకరికొకరు దూరమయ్యారు కూడా. అలా దూరమైన ప్రతి సారీ తెలంగాణ ఉద్యమం వారిద్దరని దగ్గర చేరుస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కోదండరామ్ గత మూడు నాలుగు రోజులుగా మాట్లాడుతున్న తీరును బట్టి సయోధ్య కుదిరే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది.
పాలన చేతగాకపోతే దిగిపోవాలనే తీవ్ర స్థాయిలో కోదండరామ్ వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే, కోదండరామ్ ఆ మాట అనలేదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కానీ, కోదండరామ్ అలాంటి వివరణ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఆయన అన్నట్లే భావించాల్సి ఉంటుంది. తొగుట నిర్వాసితుల విషయంలోనూ ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

కోదండరామ్ను దాదాపుగా గురువుగా భావిస్తూ వచ్చిన మంత్రులు కూడా కోదండరామ్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ జెఎసికి, టిఆర్ఎస్కు మధ్య వార్ ప్రారంభమైనట్లే ఉంది. తెలంగాణ జెఎసిని ఉద్యమ కాలంలో కింది స్థాయి నుంచి కోదండరామ్ నిర్మించారు. ఇందులో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తదితర వర్గాలకు చెందినవారున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది జెఎసికి దూరమయ్యారు.
జెఎసిలో కీలక బాధ్యతలు నిర్వహించిన కొంత మందికి ప్రభుత్వ స్థాయిలో హోదాలు, పదవులు కూడా దక్కాయి. ఈ స్థితిలో రేపు (బుధవారం) జరిగే తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారు, ఎవరు దూరంగా ఉంటారనేది తేలనుంది.
తెలంగాణ జెఎసిలో కీలక బాధ్యతలు నిర్వహించిన చాలా మంది బహుశా పాలకవర్గంలో చేరిపోయి ఉంటారు. వారు లేకుండా కోదండరామ్ నాయకత్వంలోని జెఎసికి ఏపాటి బలం ఉందనేది తేలాల్సి ఉంది. అయితే, ప్రతిపక్షాలు కెసిఆర్ను ఏ మాత్రం కూడా కదలించే స్థితిలో లేవు. కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి వంటి ప్రతిపక్షాలు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజల నుంచి మద్దతు లభించడం లేదు.
తెలంగాణ వాటి విశ్వసనీయత తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రమాదంలో పడింది. దాని నుంచి అవి బయటపడే స్థితిలో లేవు. మరోవైపు, కెసిఆర్ పథకాలపై, ఆయన పాలనపై ప్రజలు ఇంకా విశ్వాసంతోనే ఉన్నారు. గత ప్రభుత్వాల కన్నా మేలనే భావనే తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మేధావులు కూడా చాలా మంది కెసిఆర్ పాలనకు అనుకూలంగా ఉండడమో, తటస్థంగా ఉండడమో చేస్తున్నారు. మేధావులు ఇప్పటికిప్పుడు కెసిఆర్ పాలనను వ్యతిరేకించే స్థితిలో లేరు.
కాంగ్రెసు, బిజెపి, తెలుగుదేశం పార్టీలు కోదండరామ్ను ఆలంబనగా చేసుకుని కెసిఆర్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు కోదండరామ్ వెంట నడిచినా ఆశ్చర్యం లేదు. అయితే, కోదండరామ్ను రెడ్డి సామాజిక వర్గంలోని ఆధిపత్యం వర్గం ముందుకు తోస్తోందనే అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా కాంగ్రెసు నాయకులు ముందుకు తోసి, కెసిఆర్ను ఎదుర్కోవాలనే ప్రయత్నాలు చేస్తోందని భావిస్తున్నారు. అయితే, కోదండరామ్ కులాన్ని ఆసరా చేసుకుని ముందుకు సాగుతారా అనేది సందేహాస్పదమే.
కమ్యూనిస్టులు, విప్లవ సానుభూతిపరులు ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటిపై విమర్శలే చేస్తారనే అభిప్రాయం ఉంది. ఈ స్థితిలో రెండేళ్ల పాటు విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధం కావాలో నేర్పుకుంటూ వస్తున్న కోదండరామ్ ఒక్కసారిగా రాజకీయ అవతారం ఎత్తారు. కెసిఆర్కు ధీటైన ప్రతిపక్షం కోదండరామ్ అవుతారా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications