"టీఆర్ఎస్ లోకి కోమటి బ్రదర్స్" : 'క్యూ'లో ఎంపీ మల్లారెడ్డి ..?
నల్గొండ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలబోతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి పార్టీ ఆపసోపాలు పడుతున్న సమయంలో నల్గొండ నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడంలో సఫలమై, జిల్లాలో తమ పట్టు ఎంతటిదో నిరూపించుకున్న కోమటి బ్రదర్స్.. త్వరలోనే కారెక్కబోతున్నారన్న చర్చ జోరందుకుంది.
ఇదే జరిగితే ఈ పరిమాణంతో కాంగ్రెస్ పార్టీ మరింత ఢీలా పడే అవకాశముంది. కాగా నల్గొండ పొలిటికల్ బ్రదర్స్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జూన్ మొదటివారంలో గులాబీ గూటికి చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీ మారే విషయంపై కోమటి బ్రదర్స్ ఇప్పటికే తమ అనుచరులతో కూడా చర్చించినట్టుగా సమాచారం. అనుచరులను, కార్యకర్తలను ఒప్పించాకే పార్టీ మార్పు ఆలోచనపై ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే జిల్లాలోనే ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలనే యోచనలో కోమటి బ్రదర్స్ ఉన్నట్టు సమాచారం.
గత కొంతకాలంగా కోమటిబ్రదర్స్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండడం, ఈ వార్తలకు ఊతమిస్తుండగా కోమటిరెడ్డి రాజగోపాల్ మాత్రం పార్టీ మార్పు వార్తలను ఖండించారు. కాంగ్రెస్ లోనే తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తేల్చి చెప్పిన రాజగోపాల్ రెడ్డి, పార్టీ మార్పు ఆలోచనే లేదన్నారు.
ఇదిలా ఉంటే.. పార్టీ మార్పు వార్తలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గానీ ఆయన అనుచరులు గానీ స్పందించలేదు. దీంతో వెంకట్ రెడ్డి ఒక్కరే పార్టీ మారుతున్నారా..! అన్న అనుమానాలు అటు కాంగ్రెస్ లోను బలపడుతున్నట్టుగా సమాచారం. ఇదే జరిగితే అన్నాదమ్ములు చెరో పార్టీలో రాజకీయాల్లో కొనసాగుతారన్న మాట.
'క్యూ'లో ఎంపీ మల్లారెడ్డి ..?
హైదరాబాద్ : ఇప్పటికే పార్టీ ఉనికిని కోల్పోయి తెలంగాణలో చాలావరకు దెబ్బతిన్న టీడీపీకి త్వరలోనే మరో షాక్ తగలనుందా..! అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజా సమాచారం ప్రకారం టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ కి ఉన్న జనామోదాన్ని చూసిన తర్వాత పార్టీ మారడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట మల్లారెడ్డి. ఇదే విషయమై నియోజకవర్గ కార్యకర్తలతోను చర్చించిన మల్లారెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.
ఇప్పటిదాకా తెలియవస్తోన్న సమాచారం ప్రకారం జూన్ 2వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా మల్లారెడ్డి పార్టీ మార్పు ఉండబోతుందని సమాచారం. ఇదే జరిగితే తెలంగాణలో టీడీపీ మిగిలిన ఒకే ఒక్క ఎంపీ స్థానం కూడా మల్లారెడ్డి తాజా నిర్ణయంతో టీఆర్ఎస్ ఖాతాలోకి మారిపోనుంది.