బీజేపీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్!?: నిజమేనా!, రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నారు..
కోమటిరెడ్డి సోదరులను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కుదేలైనప్పటికీ.. అంతో.. ఇంతో నల్గొండ జిల్లాలో ఆ పార్టీ పటిష్టంగా కనిపిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇలా ముఖ్య నేతలంతా అదే జిల్లాకు చెందినవారు కావడంతో నల్గొండ కాంగ్రెస్ లో ఇంకా కళ చెదిరిపోలేదు.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సైతం వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ గనుక ఇక్కడినుంచి రంగంలోకి దిగితే.. గులాబీ దళానికి అది మరింత లాభించనుండగా.. కాంగ్రెస్ కు మాత్రం పెద్ద దెబ్బే తగులుతుందన్న వాదనలు ఉన్నాయి. ఈ లెక్కలను బేరీజు వేసుకునే కేసీఆర్ నల్గొండ నుంచి బరిలో దిగేందుకు ఉత్సాహాంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదంతా పక్కనబెడితే, జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల హవా నడుస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. అందులో అధికార పార్టీ హవాకు బ్రేక్ వేసి మరీ కోమటిరెడ్డి రాజగోపాల్ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఈ విజయం కొంత ఉత్సాహానిచ్చింది.
టీఆర్ఎస్ లోకి వెళ్తారని తొలుత:
ఇక తాజా రాజకీయాలను పరిశీలిస్తే.. గత కొన్నిరోజులుగా కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారుతురాన్న ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి కోసం తొలుత టీఆర్ఎస్ లోకి వెళ్తానన్నారని, అందువల్ల సోదరులిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.
బీజేపీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్!:
ఇప్పుడేమో వారిద్దరు బీజేపీలోకి పలాయనమవుతున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. 'కోమటిరెడ్డి సోదరులు బీజేపీలోకి వెళ్తున్నారంటూ అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. గతంలో టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని ఇప్పుడేమో బీజేపీలోకి వెళ్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు' అంటూ ఆయన మండిపడ్డారు.
దెబ్బతీయడానికే ఈ ప్రచారం:
కోమటిరెడ్డి సోదరులను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీలోనే చివరిదాకా కొనసాగుతాం అని తెలిపారు.తెలంగాణ ఇచ్చిన సోనియా-రాహుల్ నాయకత్వంలో విశ్వాసంగా పనిచేస్తామన్నారు. పార్టీలో తామంటే గిట్టనివారు, టీఆర్ఎస్ నాయకులు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి తీసుకొస్తాం:
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కష్టపడుతామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎటువంటి స్వార్థం లేకుండా పార్టీ కోసం పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీపై సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసంతోనే ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచానని అన్నారు.