హైకోర్టులో తెలంగాణ పోలీసులకు ఊరట .. వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు
హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ లో తెలంగాణ పోలీసులకు ఊరట కలిగింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణలో ఉండగా భద్రత ఉపసంహరించుకున్నారని కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను ఇదివరకే విచారించిన సింగిల్ బెంచ్ డీజీపీ, నల్గొండ, జోగులాంబ ఎస్పీలు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తీర్పునిచ్చింది. దీనిని తెలంగాణ పోలీసులు సవాల్ చేస్తూ .. డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.

ఎట్టకేలకు ఊరట ..
తెలంగాణ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తెలంగాణ డీజీపీ, నల్గొండ, జోగులాంబ ఎస్పీలను హైకోర్టు సింగిల్ బెంచ్ తప్పుపట్టింది. పిటిషినర్ల భద్రతను గాలికొదిలేశారని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే దీనిని తెలంగాణ పోలీసులు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను బుధవారం విచారించిన ధర్మాసనం .. గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అలాగే కేసు విచారణ సందర్భంగా వారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కూడా ఇచ్చింది.

ఇదీ నేపథ్యం ..
గతేడాది శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ అనుచితంగా ప్రవర్తించారు. ఒకనొక సమయంలో ఆగ్రహానికి గురైన కోమటిరెడ్డి .. స్పీకర్ పై మైక్ విసిరేశారు. దీంతో పక్కనే ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు తగిలింది. ఆ తర్వాత వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత వారి భద్రతను వెనక్కి తీసుకోవడంతో మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. ఈ కేసు విచారణ సందర్భంగా .. హైకోర్టు సింగిల్ బెంచ్ కోమటిరెడ్డి, సంపత్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తెలంగాణ పోలీసులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంది. దీంతో డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడంతో .. పోలీసులకు ఊరట కలిగినట్టైంది.












Click it and Unblock the Notifications