ఎన్టీఆరే పిచ్చి పనులు చేసి ఓడిపోయారు: కోమటిరెడ్డి సంచలనం
నల్గొండ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నో మంచి పనులు చేసిన ఎన్టీఆరే పిచ్చి పనులు చేసి నాడు ఓడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెరాస ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంత అని ఆయన అభిప్రాయపడ్డారు.
గత కొద్ది రోజులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య రాజీనామాల సవాల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం కోమటిరెడ్డి మరోసారి గుత్తాకు సవాల్ విసిరారు. గుత్తా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రావాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆయన పైన తానే పోటీ చేస్తానన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను దుబారా చేస్తోందని ఆరోపించారు. మంచి భవనాలు ఉండగా కొత్త సచివాలయం ఎందుకు అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆయన ఎన్టీఆర్ ఓటమి పైన మాట్లాడారు.
రైతుల సమస్యల పైన కూడా స్పందించారు. రైతు సమస్యల పైన అందరు రాజకీయాలకు అతీతంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ సరిగా జరగడం లేదన్నారు. అవసరమైతే రైతు సమస్యల పైన తాను నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
జీవన్ రెడ్డి ఆగ్రహం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మంచి క్యాంపు కార్యాలయం కావాలి కానీ, పేదలకు మాత్రం ఇళ్లు వద్దా అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ రాచరిక పోకడలు పోతున్నారన్నారు. ఇప్పుడు కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఏమిటన్నారు. పేదల ఆరోగ్యం, ఇళ్ల గురించి పట్టించుకోకుండా సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడం సరి కాదన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేయాలనిడిమాండ్ చేశారు.