ఓటమిని ముందే చెప్పేసిన కోమటిరెడ్డి?
మునుగోడు ఉప ఎన్నికను బలవంతంగా ప్రజలపై రుద్దారనే ఆరోపణను ఎదుర్కొంటోన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతిమంగా ఓటమి పాలయ్యారు. భారతీయ జనతాపార్టీ తరఫున బరిలోకి దిగిన కోమటిరెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీపడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా సాగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్ సమయంలోనే వచ్చే ఫలితంపై రాజగోపాల్ రెడ్డి ముందే చెప్పేశారు.
బీజేపీకి కీలకంగా మారిన చౌటుప్పల్
బీజేపీకి చౌటుప్పల్ మండలం కీలకంగా మారింది. నియోజకవర్గంలోనే అత్యధిక ఓటర్లున్న ఈ మండలంలో ఆ పార్టీకి ఆశించిన రీతిలో ఓట్లు పోలవలేదు. ఉదయం పదకొండు గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము దెబ్బతిన్నామని, చౌటుప్పల్లో ఊహించినస్థాయిలో ఓట్లు రాలేదని చెప్పారు. ఈ మండలం ముంచేసిందన్నారు. మిగిలిన మండలాల్లో పోరు హోరాహోరీగా సాగుతుందనే ధీమాను వ్యక్తపరిచినప్పటికీ అప్పటికే ఆయన తన ఓటమిని ముందే చెప్పినట్లైంది.
ఆధిక్యతను తగ్గించేలా టీఆర్ఎస్ వ్యూహం
చౌటుప్పల్ లో బీజేపీకి భారీగా మెజారిటీ వస్తుందని భావించారు. రాజగోపాల్ రెడ్డి కూడా మొదటి నుంచి చౌటుప్పల్ పై గంపెడాశలు పెంచుకున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే సమాయానికి చౌటుప్పల్ మున్సిపాలిటీతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో కూడా కోమటిరెడ్డికి భారీగా ఆదరణ ఉంది.
ఈ విషయాన్ని గమనంలో ఉంచుకున్న గులాబీ పార్టీ ఇక్కడ ఆధిపత్యం సాధించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, జీవన్ రెడ్డి, భాస్కర్ రావు లాంటి ఉద్ధండులను రంగంలోకి దించింది. ఓటింగ్ రోజుకు కమలం ఆధిక్యతను తగ్గించగలిగామని టీఆర్ఎస్ నేతలు ధీమాగా చెప్పారు. చివరకు అదే జరిగింది.
టీఆర్ఎస్ కే స్వల్ప ఆధిక్యం
చౌటుప్పల్ మండలంలో బీజేపీకి మెజార్టీ రాకపోగా.. టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని కనబర్చింది. 4 రౌండ్లతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు ముగిసింది. చౌటుప్పల్ మండలంలో మొత్తం పోలైన ఓట్లు 55,678. టీఆర్ఎస్కు పోలైన ఓట్లు 21,209, బీజేపీ 21,174, కాంగ్రెస్ 5,164. బీజేపీని ఆశించిన స్థాయిలో చౌటుప్పల్ మండల ఓటర్లు ఆదరించలేదని స్పష్టమైంది. ఈ విషయంలో కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి తీవ్రంగా నిరాశ చెందారు