కేసీఆర్పై మళ్లీ కోమటిరెడ్డి, రాజపక్స గతేనని గుత్తా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వస్తేనే నల్గొండ జిల్లాలో సమస్యలు పరిష్కారమవుతాయని, వరంగల్ జిల్లాలో వేసినట్లు, ఆయన నాలుగు రోజుల పాటు ఇక్కడ కూడా మకాం వేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆదివారం కోరారు.
కేసీఆర్ వరంగల్ జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటనలు చేయటం హర్షణీయమన్నారు. జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బ తిన్నదని, కేసీఆర్ వచ్చి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణపై ప్రభుత్వం అధిక దృష్టి సారిస్తోందని అపవాదు ఉందని, దక్షిణ తెలంగాణ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
రాజపక్స గతే పడుతుంది: గుత్తా
కేసీఆర్కు శ్రీలంక మాజీ అధ్యక్షులు రాజపక్సకు పట్టిన గతే పడుతుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజారంజక పాలనను కుటుంబసభ్యులతో అందిస్తున్నానని కలలు కంటున్న కేసీఆర్కు ఇదే గతి పడుతుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షపాత్ర పోషించి విలువైన సూచనలను అందించినా స్వీకరించే స్థితిలో కేసీఆర్ లేరన్నారు. ప్రజాసంక్షేమాన్ని వదిలి గాలిలో చక్కర్లు కొడుతున్నారన్నారు.
టీపీఎస్సీ చైర్మన్ను తొలగించాలి: మందకృష్ణ మాదిగ
తెలంగాణ రాష్ట్రంలో నూతన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని, మాదిగలకు వ్యతిరేకిగా ముద్రపడ్డ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిని ఆ పదవి నుంచి తొలగించాలని ఎమ్మార్ఫీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ ఆదివారం డిమాండ్ చేశారు.
ఘంటా చక్రపాణి చైర్మన్గా ఉంటే మాదిగ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్ మాదిగలపై కపట ప్రేమ ఒలకపోస్తున్నారని, మాలలపై నిజమైన ప్రేమ చూపిస్తున్నారన్నారు. పదవుల కోసం కేసీఆర్ చూట్టు తిరుగుతూ కొందరు మాదిగలు విశ్వాస ఘాతుకానికి పాల్పడుతూ, మాదిగలను మోసం చేస్తున్నారన్నారు. టీపీఎస్సీలో ఒక్కమాదిగకు కూడా చోటు కల్పించకపోవడం దారుణమన్నారు.
కేసీఆర్, ఘంటా చక్రపాణిల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని, ఉద్యోగాలను ముందుగా మాలలకు, ఆ తరువాత మిగతా ఉద్యోగాలను అగ్రకుల విద్యార్థులకు ఇవ్వాలన్నదే ఆ ఒప్పందమన్నారు. ఈ ఒప్పందంతో మాదిగలకే కాకుండా బీసీ, మైనార్టీలకు అన్యాయం జరగనుందన్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఎందుకు అమలు చేయటం లేదన్నారు.