కేసీఆర్ది అధికార మదం, దించేస్తాం: కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
నల్గొండ: తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార మదంతో వ్యవహరిస్తున్న కేసీఆర్ను గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
సోమవారం నల్గొండలోని బండారు గార్డెన్స్లో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తలపెట్టిన 'చలో అసెంబ్లీ ముట్టడి' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ నిర్లక్షం..
అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని కోమటిరెడ్డి మండిపడ్డారు. వరి కోతలు మొదలై రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ర్యాలీగా వెళ్లి ఆందోళన
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్టపరిహారం, మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ శ్రేణులు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేశారు.
హరీశ్ చెప్పినా.. ప్రగతి భవన్ వీడని కేసీఆర్..
పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమత్రి కేసీఆర్ ప్రగతి భవన్ను వీడటం లేదని ఎద్దేవా చేశారు. అక్టోబర్ 19న పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మంత్రి హరీష్రావు చెప్పినా ఇప్పటి వరకు అనేకచోట్ల ఇంకా ప్రారంభించలేదన్నారు.
వచ్చేది కాంగ్రెస్ సర్కారే..
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని, తదనంతరం రైతు రాజ్యం వస్తుందని అభిప్రాయపడ్డారు. అనంతరం జేసీ సి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. నకిరేకల్ మాజీ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య, బొడ్డుపల్లి శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యుడు దూదిమెట్ల సత్తయ్య, వెంకట్రెడ్డి, ఎంపీపీ రాజు, బుజ్జి, శ్రీనివాస్గౌడ్, భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.