పొగబెట్టారు! అలా ఐతే పార్టీలో ఉండం: తేల్చేసిన కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీపీసీసీ ప్రక్షాళన లేదని పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తే..
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీపీసీసీ ప్రక్షాళన లేదని పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తే.. తమ దారి తాము చూసుకుంటామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు.
అలా ఐతే పార్టీలో ఉండం..
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే తాము పార్టీలో ఉండమని తేల్చి చెప్పారు. ఉత్తమ్ వల్లే తెలంగాణ మూడేళ్లు ఆలస్యమైందని అన్నారు. అంతేగాక, తాను ఆనాడు వదిలేసిన మంత్రి పదవిని ఉత్తమ్ తీసుకున్నారని విమర్శించారు.
పొగబెడుతున్నారు..
ఉత్తమ్ కుమార్ లాబీయింగ్ చేసి టీపీసీసీ పదవిని సంపాదించుకున్నాడని, తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా ద్వారా తమపై ఉత్తమ్ దుష్ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు.
అవమానించారు..
కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో తనను కావాలనే అవమానించారని, కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో 2019 ఎన్నికలకు వెళ్తే ఐదారు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు.
బీజేపీలోకేనా..?
కాగా, గత రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ శిక్షణా శిబిరంలో తమను వేదికపైకి ఆహ్వానించలేదని అసహనం వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విధంగా కోమటిరెడ్డి సోదరులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? అనేది తేలాల్సి వుంది.