ఉంటారా? పోతారా? కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిశ్రమ సంకేతాలు!!
కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్ ఇంకా సమసిపోలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతుంటే, పార్టీలోనే ఉంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోజుకో పంచాయతీకి తెర తీస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిశ్రమ సంకేతాలు పార్టీలో ఉంటారా? పోతారా? అన్న అనుమానాలకు కారణంగా మారాయి. కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి.

కాంగ్రెస్ నేతలందరినీ తప్పు పడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో చర్చలు జరిగిన ఒకరోజు తర్వాత టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ సహా రాష్ట్రస్థాయి నేతలందరినీ తప్పుబట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీని వీడిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో రేవంత్ రెడ్డి మరియు ఇతర టి పి సి సి నాయకత్వంపై దాడిని కొనసాగించారు. అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి తమ కుటుంబాన్ని అవమానించారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి తో క్షమాపణలు చెప్పించుకున్నారు.

మునుగోడులో ప్రచారం చెయ్యనంటున్న కోమటిరెడ్డి బ్రదర్
ఇక ప్రస్తుతం మరోమారు తనను అవమానిస్తున్నారని, కావాలనే తనను మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా ఉంచుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాణిక్యం ఠాగూర్ జానా రెడ్డి నివాసానికి వెళ్తాడు, కాని నా ఇల్లు సమీపంలో ఉన్నప్పటికీ నన్ను పిలవడానికి రారు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఆదేశానుసారం వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి తీరుపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. తాను మునుగోడుకు వెళ్లి కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనని వెంకట్రెడ్డి తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ లో ఉంటూనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ విమర్శలు
అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై వేదికపై ఉన్న నేతలు వెంటనే స్పందించాల్సి ఉంది. నా సోదరుడు పార్టీ నుండి నిష్క్రమించడంతో తనను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అధిష్టానం వద్ద తేల్చుకుంటా అని చెప్పారు.కాంగ్రెస్లో కొనసాగడం, రాబోయే ఉపఎన్నికల్లో తన పాత్రపై అస్పష్టమైన వ్యాఖ్యలు చేసిన వెంకట్ రెడ్డి తనను హోంగార్డు తో పోల్చి పార్టీ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్తే, ప్రచారానికి ఆలోచిస్తానని అన్నారు.

దయాకర్ మాట్లాడితే నేనెందుకు క్షమాపణ చెప్పాలన్న రేవంత్ రెడ్డి
యాదృచ్ఛికంగా, దయాకర్ చేసిన వ్యాఖ్యలపై తన తప్పుకు క్షమాపణలు చెప్పారని, ఆ ప్రకటనతో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఇక అద్దంకి దయాకర్ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను అని చెప్పగా , రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆజాదీ గౌరవ్ యాత్ర లో స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా కీలక నాయకులు అందరూ పాల్గొంటారు అంటూ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇక చీటికిమాటికి తనను అవమానించారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల తీరుపై ఆయన చూపిస్తున్న అసహనం పార్టీకి తలనొప్పిగా మారింది. అసలు కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతారా లేదా ఆయన కూడా వెళ్ళిపోతారా అన్న అనుమానాలకు కారణం అవుతుంది. ప్రతి విషయంలోనూ మిశ్రమంగా స్పందిస్తున్న ఆయన తీరు కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. చీటికీ మాటికీ నేతలను తప్పు పడుతున్న ఆయన తీరు పార్టీలో చర్చకు కారణంగా మారింది.

నేటి నుండి ఆజాదీ గౌరవ్ యాత్ర.. కోమటిరెడ్డి పాల్గొంటారా?
కాంగ్రెస్ పార్టీ హయాంలో నేటి నుండి ఆజాదీ గౌరవ్ యాత్ర మునుగోడు నియోజకవర్గం నుండి ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఆయన తన పాదయాత్రను సంస్థాన్ నారాయణపూర్లో ప్రారంభించి 15 కిలోమీటర్ల దూరంలోని చౌటుప్పల్లో ముగించనున్నారు. ఆగస్టు 13 నుంచి 17 వరకు నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. మరి ఈరోజు నుండి జరగనున్న ఆజాదీ గౌరవ్ యాత్రలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొంటారా లేదా అన్నది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications