పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనం; షర్మిల ఘటన; కవిత స్కామ్ పైనా ఇలా!!
కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలకు తర్వాత సైలెంట్ గా వున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కెసిఆర్ కుమార్తె కవిత విషయంలో సిబిఐ విచారణపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిలపై దాడిని ఖండించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
వైయస్ షర్మిల పై జరిగిన దాడి ఘటనను అందరూ ఖండించాలని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ షర్మిల కు మద్దతు పలికారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో ఏడాదిపాటు తాను తన నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెడతానని వెల్లడించారు.

తాను ఏ పార్టీలోకి వెళ్తా అన్నది ఎన్నికలకు ముందు చెప్తా
తాను ఏ పార్టీలోకి వెళ్తాననే విషయాన్ని ఎన్నికలకు నెల ముందు చెబుతానని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని టిఆర్ఎస్ పార్టీ అదే బలం అనుకుంటుంది అని టీఆర్ఎస్ పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వల్లనే సిబిఐ ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిపితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కు ఎందుకు ఈ మినహాయింపు అంటూ ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

కవిత ఇంటికి వెళ్లి ఎందుకు సీబీఐ విచారణ చెయ్యాలి.. ఆఫీసుకు పిలవొచ్చుగా
కవిత ఇంటికి వెళ్లి సిబిఐ ఎందుకు విచారణ చేయాలని ప్రశ్నించిన ఆయన, కవితను సిబిఐ ఆఫీస్ కి ఎందుకు పిలవడం లేదంటూ నిలదీశారు. దీనిని బట్టే బీజేపీ, టీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్యాయని అర్థమవుతోందని, బయటకు మాత్రం రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడం కోసం టీఆర్ఎస్, బీజేపీలు కలిసి పన్నాగాలు పన్నుతున్నారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

నాలుగు ఫ్లై ఓవర్లు, రెండు రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి కాదు
టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి చేసిందేమీ లేదని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం నాలుగు ఫ్లైఓవర్లు, రెండు రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి అయిపోయినట్టు కాదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య చాలా ఖరీదైన పోయిందని పేర్కొన్న ఆయన, చదువుకోవడం కోసం చాలామంది విద్యార్థులు తన వద్దకు సహాయం కోసం వస్తున్నారు అంటూ పేర్కొన్నారు. కొందరు నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తున్నారని, కానీ రాజ్యాంగం ఇంకా పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొత్తంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications