రేవంత్ రెడ్డి టార్గెట్ గా కోమటిరెడ్డి రచ్చ: ఉద్యమం మొదలు పెడతా; తడాఖా చూపిస్తానంటూ షాకింగ్ వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రచ్చ కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొరకరాని కొయ్యగా మారారు. సొంత పార్టీ నేతలపై నిత్యం విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పరువును రోడ్డున పెడుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మరోమారు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ విమర్శలు పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.
మరోమారు షాకింగ్ కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి
మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ గెలుపు వెనుక హస్తం పార్టీ అందించిన సహకారం ఉందని షాకింగ్ వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గం లో ఘోర ఓటమి పాలవడంపై హై కమాండ్ కు ఫిర్యాదు చేస్తామని, హుజురాబాద్ లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ కోసం బలహీనం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామారెడ్డి - ఎల్లారెడ్డి నుండి తన ఉద్యమాన్ని మొదలు పెడతా అని, తన తడాఖా ఏంటో చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీని అప్పుడు దెయ్యమని ఇప్పుడు దేవత అంటున్న నేతలు తమ పార్టీలోనే
కాంగ్రెస్ పార్టీ తనకు ప్రాణం అని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియా గాంధీ తనకు దేవత అని పేర్కొన్నారు. శనివారం నాడు సీఎల్పీ ఆఫీస్ లో మాట్లాడిన ఆయన తమ పార్టీలో కొందరు నేతలు సోనియా గాంధీ అప్పుడు దెయ్యమని ఇప్పుడు దేవత అంటున్నారని విమర్శించారు. పెద్ద లీడర్లని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 72 నుండి 78 సీట్లు వస్తాయని చెప్పుకున్నారని, అంతేకాదు మంత్రులు, ముఖ్యమంత్రులు పంపకాలు కూడా చేసుకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీలో కాంగ్రెస్ ఓట్లు అలా .. తెలంగాణాలో మాత్రం ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు అనుకుంటే అక్కడ బద్వేలు ఉప ఎన్నికలో ఆరు వేల ఓట్లు వచ్చాయని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకుంటున్నా డిపాజిట్లు కూడా రాలేదని అసహనం వ్యక్తం చేశారు. తాను జిల్లా లీడర్ ని వాళ్లంతా గొప్ప గొప్ప లీడర్లు అంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక గెలుపు ఓటమి రెండు సమానమే అని పేర్కొన్న ఆయన రాజకీయాలను పక్కన పెట్టి కెసిఆర్ ని గద్దె దించడం కోసం పనిచేయాలన్నారు. ప్రజల గురించి ఆలోచన చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
కేసీఆర్ సూటు బూటు వేసుకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, సీఎం కేసీఆర్ సూటు బూటు వేసుకున్న అంతమాత్రాన రాష్ట్రానికి పెట్టుబడులు రావని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతుబంధు వల్ల ఎవరికి ఉపయోగం లేదని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం కేసీఆర్ చతిస్గడ్ సీఎం ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటూ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదేపదే సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం, అధిష్టానానికి పార్టీ నేతలపై ఫిర్యాదులు చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది.
కాంగ్రెస్ లో రచ్చ .. రేవంత్ కు తలనొప్పిగా కోమటిరెడ్డి తీరు
కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టకుండా, అంతర్గత కుమ్ములాటలతో తన్నుకు చస్తున్నారంటూ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ ధోరణి మారనంత కాలం పార్టీ బాగుపడే అవకాశాలు లేవని భావిస్తున్న వారు లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి ప్రయత్నం చేయకుండా, సొంత పార్టీ నేతలపై ఆరోపణలు, అలకలు, ఫిర్యాదులతో కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న రచ్చ ఇప్పుడు పార్టీ శ్రేణులలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని తొలి నాటి నుండి వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా తయారైంది.