'కేసీఆర్ ఉన్నంత వరకే టీఆర్ఎస్, ఆ తర్వాత 14 ముక్కలవుతుంది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ భవిష్యత్తుపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా పట్టణంలో రూ. 2 కోట్లతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ఉన్నంత వరకే టీఆర్ఎస్ మనుగడ ఉంటుందని ఆ తర్వాత కేటీఆర్, హరీశ్ రావు, కవిత, వినోద్ ఇలా 14 ముక్కలవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జై తెలంగాణ అనొద్దని హెచ్చరించిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు మంత్రి పదవులు లభించాయని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కొడుకును పొగొట్టుకున్న శంకరమ్మకు మాత్రం మొండి చేతులే మిగిలాయని అన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఇంతలా మండిపడటానికి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డిపై వివక్షకు తెర తీశారని వాదనలు వినిపిస్తున్నాయి.
ఆర్డీవో కార్యాలయ ప్రారంభోత్సవానికి స్థానికంగా ఉన్న అధికారులంతా హాజరుకావాల్సి ఉంది. అంతేకాక ప్రభుత్వం నుంచి మంత్రులు కూడా రావాల్సి ఉంది. అయితే కోమటిరెడ్డి కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే కావడంతో ఈ కార్యక్రమానికి మంత్రులు హాజరు కాలేదు.
మంత్రులు ఈ కార్యక్రమానికి రాని నేపథ్యంలో అధికారులు కూడా ముఖం చాటేశారు. టీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకే అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.