కేటీఆర్ మూర్ఖుడు... మానవత్వం ఉంటే బాధిత కుటుంబం వద్దకు రావాలి : హత్యాచార ఘటనపై కోమటిరెడ్డి
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.చిన్నారి హత్యాచారానికి గురైతే... బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, డమ్మీ హోంమంత్రి మహమూద్ అలీ కానీ, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కానీ రాకపోవడం దారుణమన్నారు.ఈ హత్యాచార ఘటనతో తెలంగాణ పరువు పోయిందని వ్యాఖ్యానించారు.
నిందితుడిని ఇప్పటివరకూ పట్టుకోలేకపోయిన పోలీసులు.. ఆచూకీ చెబితే రూ.10లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు నిందితుడి ఆచూకీ చెబితే పోలీసులు గాడిదలు కాస్తారా? అని విమర్శించారు. చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు అంతే కారణమని ఆరోపించారు. తల్లి ఫిర్యాదు చేసిన వెంటనే నిందితుడి ఇంటి తలుపును పోలీసులు ఓపెన్ చేసి ఉంటే చిన్నారి బ్రతికి ఉండేదని అన్నారు.
కేటీఆర్ ప్రచారాల మంత్రి అని, మూర్ఖుడు అని కోమటిరెడ్డి విమర్శించారు.కేటీఆర్కు మానవత్వం ఉంటే బాధిత కుటుంబం వద్దకు వచ్చి పరామర్శించాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పేరుతో తెలంగాణ అంతా తిరిగే కవిత ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బాధితురాలు దళిత గిరిజన బిడ్డ కాబట్టే కేటీఆర్ పరామర్శకు రాలేదని అన్నారు. తెలంగాణ పోలీసులకు అవార్డులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకోవడం మాని దోషులను త్వరగా పట్టుకుని శిక్షించాలన్నారు.
బిడ్డ చనిపోయిన బాధలో ఆ తల్లిదండ్రులు ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని కలెక్టర్ చెప్పడం బాధాకరమన్నారు. సినీతారలను పరామర్శించే తలసాని శ్రీనివాస్ ఇక్కడికి ఎందుకురారని, అయన అసలు మంత్రేనా అని మండిపడ్డారు. దిశ హత్యాచారం ఘటనలో చేసినట్లే ఈ చిన్నారి విషయంలోనూ నిందితుడిని వెంటనే శిక్షించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
హత్యాచార ఘటన జరిగిన దాదాపు వారం రోజులు కావొస్తున్నా నిందితుడి ఆచూకీ ఇంతవరకూ దొరకలేదు. ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా... ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ స్పందించకపోవడం గమనార్హం. గిరిజన బాలిక కాబట్టే కేసీఆర్ స్పందించట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సీతక్క ఇవే విమర్శలు చేశారు. అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఫైర్ అయ్యారు.కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే కింది కులాల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.ఆధిపత్య కులాల పాలనలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలకు న్యాయం జరగదన్నారు.
మరోవైపు నిందితుడి కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. దాదాపు 500 మంది పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. టాస్క్ఫోర్స్ ఎస్వోటీ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని అన్ని బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు,లేబర్ అడ్డాలను జల్లెడ పడుతున్నారు. నిందితుడికి మద్యం,కల్లు తాగే అలవాటు ఉండటంతో మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాల వద్ద కూడా నిఘా పెట్టారు.గత గురువారం(సెప్టెంబర్ 9) ఈ హత్యాచార ఘటన చోటు చేసుకోగా...మరుసటిరోజు నిందితుడు బాలాపూర్ ప్రాంతంలో సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది.పక్కనే ఉన్న ఎల్బీనగర్ రోడ్లు,వీధుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.