మా వాడి పెళ్లికి రండి: ప్రధాని మోడీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు
హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీసమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. తన రెండో కుమారుడు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాని మోడీని కలిశామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తమను ప్రధాని మోడీ ఎంతో అప్యాయంగా పలకరించారని ఆయన తెలిపారు.
ప్రధానితో కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతుల భేటీ
తెలంగాణలో వైద్యం, విద్య, తదితర అంశాల మీద వారితో చర్చించడం ఎంతో గొప్ప అనుభూతినిచ్చింది. స్కూల్ టాయిలెట్స్ క్లీన్ చేసే మా స్వచ్ఛ్ ట్రక్ ప్రాజెక్టు, ఇంకా పెద్దమంగళారంలో ఉన్న మా బయో గ్యాస్ ప్రాజెక్టుల గురించి ప్రధాని మోడీకి వివరించాం అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఎంతో ఓపికతో ప్రధాని విన్నారని తెలిపారు.
ప్రధాని మోడీ అప్యాయంగా పలకరించాంటూ సంగీతా రెడ్డి
ఇంత సమయం ఇచ్చినందుకు తాము చాలా సంతోషిస్తున్నాము. ప్రధానమంత్రి మోడీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ వేదికగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సంగీతా రెడ్డి కూడా ప్రధాని మోడీతో భేటీపై స్పందించారు. ఎంతో అప్యాయంగా పలకరించారన్నారు. ఈ సందర్బంగా పలు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడామని చెప్పారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండో కుమారుడి పెళ్లి
కాగా, 2014లో టీఆర్ఎస్ తరపున చేవెళ్ల ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సభ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కాగా, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి ఎవరో కాదు.. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సీ రెడ్డి కుమార్తె సంగీతా రెడ్డి. వీరికి ముగ్గురు కుమారులు ఆనందిత్, విశ్వజిత్, విరాజ్. త్వరలో రెండవ కుమారుడు విశ్వజిత్ వివాహం జరగనుంది. దీంతో రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందిస్తున్నారు.