బీజేపీలోకి కొండా విశ్వేశ్వర రెడ్డి.. ఆహ్వానించిన తరుణ్ చుగ్..!!
తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. వరుస పరిణామాలతో ఆసక్తి కరంగా మారుతున్నాయి. పార్టీల్లో చేరికలు మొదలయ్యాయి. హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలను తమ పార్టీలోకి చేర్చుకొనే వ్యూహాలను కమలం నేతలు అమలు చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతున్నారు. అందులో భాగంగా.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక కాషాయం కండువా కప్పుకోవటం దాదాపు ఖాయమైంది.

ముఖ్యులకు పార్టీలోకి ఆహ్వానం
తెలంగాణ పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేకంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డితో సమావేశమయ్యారు. సుదీర్ఘ మంతనాలు సాగించారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతోనూ మాట్లాడించారు. ఆయన అనుమానాలను నడ్డా క్లియర్ చేసారు. పార్టీలో సముచిత స్థానం పైన హామీ ఇచ్చారు. దీంతో..కొండా విశ్వేశ్వ రెడ్డి బీజేపీలో చేరటానికి ముహూర్తం సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జూలై 1వ తేదీ నుంచి నాల్గవ తేదీ వరకు బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. దీంతో.. నడ్డాతో పాటుగా బీజేపీకి చెందిన ప్రముఖుల సమక్షంలో కొండా విశ్వేశ్వర రెడ్డి కాషాయం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

జాతీయ నేతల సమక్షంలో
బండి సంజయ్ పాదయాత్ర వేళ కొండావిశ్వేశ్వర్ రెడ్డి వెళ్లి బండిని కలిశారు. వీరిద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. దాని కంటే ముందు ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డిని ఆయన ఇంట్లో విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరువురు దాదాపు రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు. ఈ సమావేశం అనంతరం వీరిద్దరు కలిసి బండి సంజయ్ ను కలిశారు. ఇక, ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే ముందు ఆయనతో పలు దఫాలు కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయనతో సమావేశాలు నిర్వహించారు. బంధుత్వం కారణంగానే తాను కలిసినట్లుగా వెల్లడించారు.

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
ఇక, జాతీయ పార్టీలో చేరాలా.. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలనే దాని పైన తుది నిర్ణయం జరగలేదని..త్వరలోనే తన కార్యాచరణ వెల్లడిస్తానంటూ కొద్ది రోజుల క్రితం కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గాలు జరగటం.. బీజేపీ జాతీయ నేతలు వస్తుండటంతో..వారి సమక్షంలో చేరటం ద్వారా గుర్తింపు దక్కుతుందని విశ్వేశ్వర రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..చివరి నిమిషంలో ఎటువంటి మార్పులు లేకుంటే కొండా విశ్వేశ్వర రెడ్డి కాషాయం కండువా కప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications