కొండపోచమ్మ సాగర్కు సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామితో కలిసి ప్రారంభం, షెడ్యూల్ ఇదే..
గజ్వేల్ నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరబోతుందన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల స్వప్నం కొండ పోచమ్మ సాగర్కు శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. 618 మీటర్ల ఎత్తున ఉన్న నీటిని ఎత్తిపోయనుందన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అన్ని పండుగల సమూహారం కొండ పోచమ్మ ప్రారంభోత్సవం అని హరీశ్ రావు అన్నారు.
చరిత్రలో నిలచిపోతోంది...
మే 29వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని హరీశ్ రావు చెప్పారు. ఈ ఏడాది మమూలుగా జరుపుకుందామని, కరోనా వైరస్ వల్ల తప్పడం లేదు అని చెప్పారు. కొండ పోచమ్మ దేవాలయంలో శుక్రవారం ఉదయం 4.30 గంటలకు చండీయాగం ప్రారంభం అవుతుందని హరీశ్ రావు వివరించారు. సర్పంచ్ రజిత- రమేశ్, కొండ పోచమ్మ దేవాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి చండీహోమం నిర్వహిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ దంపతులు ఉదయం 7 గంటలకు అమ్మవారికి జరిపే ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పూర్ణాహుతిలో పాల్గొంటారు. తర్వాత వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారని హరీశ్ రావు తెలిపారు.
జీయర్ స్వామితో కలిసి
ఉదయం 9.35 గంటలకు ఎర్రవల్లిలో రైతు వేదికకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 9.40 గంటలకు మర్కుక్లోని రైతు వేదికను ప్రారంభిస్తారని తెలిపారు. ఉదయం 9.50 గంటలకు సీఎం మర్కుక్ పంప్ హౌస్ చేరుకొని.. త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. 11.30 గంటల సమయంలో పంప్ హౌస్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. చినజీయర్ స్వామితో కలిసి కొండ పోచమ్మ సాగర్ కట్ట మీద డెలివరీ సిస్టమ్ వద్దకు చేరుకుంటారు. 11.35 గంటలకు డెలివరీ సిస్టమ్ వద్ద గోదావరి జలాలను స్వాగతిస్తూ.. ప్రత్యేక పూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.
Recommended Video
నేతలు, అధికారులతో భేటీ
మధ్యాహ్నం 12 గంటలకు కొండ పోచమ్మ డెలివరీ సిస్టమ్ నుంచి బయలుదేరి వరదరాజుపూర్ గ్రామంలోని వరద రాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తారు.12.40 గంటలకు వరదరాజు పూర్ నుంచి బయలుదేరి మర్కుక్ పంప్ హౌస్ వద్దకు కేసీఆర్ చేరుకొని.. ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. కరోనా వైరస్ వల్ల గజ్వేల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం కొండ పోచ్చమ్మ సాగర్ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో.. తర్వాత ప్రజలు వచ్చి భౌతిక దూరాన్ని పాటిస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ సందర్శించొచ్చు అని హరీశ్ రావు తెలిపారు.