'కృష్ణా జల్': రూ.101కి బాటిళ్లలో పవిత్ర కృష్ణా పుష్కర నీరు
హైదరాబాద్: పుష్కరాలకు వెళ్లలేని వారికి ప్రముఖ ఈ-కామర్స్ బిజినెస్ సంస్థ యాడ్రోబ్ ఆ పుణ్య నీటిని అందిస్తోంది. దాదాపు ప్రతి ఒక్కరు పవిత్ర పుష్కర స్నానం చేయాలని కోరుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల అందరూ పుష్కరాలకు వెళ్లి పుణ్య స్నానం ఆచరించలేరు.
దీనిని దృష్టిలో పెట్టుకొని యాడ్రోబ్ డాట్ ఇన్ కంపెనీ బాటిళ్లలో నీటిని అందించనుంది. వాక్ ఫర్ వాటర్ స్వచ్చంధ సేవా సంస్థతో కలిసి కృష్ణా నీటిని 'కృష్ణా జల్' పేరుతో సీసాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సహా దేశంలోని ఏ ప్రాంతానికైనా సరఫరా చేయనున్నారు.
ఈ విషయాన్ని యాడ్ రోబ్ కంపెనీ ఎండీ కేశిరెడ్డి రాజిరెడ్డి శనివారం నాడు తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని వారికి సీసా ధర వేర్వేరుగా ఉండనుంది. హైదరాబాదులోని వారికి రూ.101 సరఫరా చేస్తారు. ఏపీ, తెలంగాణలలోని ఇతర ప్రాంతాలలో రూ.151కి ఇస్తారు. ఇతర నగరాల్లో రూ.201కి ఇస్తారు. నీటి సీసాలు కావాల్సిన వారు www.adrobe.in ద్వారా బుక్ చేసుకోవచ్చు.
అంతేకాదు, పుష్కర దీపం ప్యాకేజీ కింద ఇంటికే వచ్చి గోత్ర, నామాలు తెలుసుకొని విజయవాడలో, తెలంగాణలోని ఏదైనా ఓ ఘాట్లో వారి పేరున పూజ నిర్వహించి, దీపాన్ని నదిలో విడిచే ఏర్పాటు కూడా చేస్తామని రాజిరెడ్డి తెలిపారు.