ఏం తేలుస్తారు.. నేడే సాంకేతిక కమిటీ సమావేశం.. చిచ్చు చల్లారేనా..?
నిన్న మొన్నటిదాకా సఖ్యతతో సాగిన ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు చిచ్చు పెట్టింది. ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవో.203 ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఆ జీవోను తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుందని కేసీఆర్ సర్కార్ మండిపడుతోంది.
Recommended Video
మరోవైపు తాము తెలంగాణకు అన్యాయం చేసే రీతిలో వ్యవహరించమని చెబుతూనే.. బోర్డు పంపకాలను రాజకీయం చేసే ఆలోచన సమంజసం కాదని కేసీఆర్ సర్కార్కు జగన్ సర్కార్ చురకలంటించింది. ఈ నేపథ్యంలో నేడు కృష్ణా బోర్డు సాంకేతిక కమిటీ సమావేశం జరగనుంది. సమావేశంలో ఏం తేలుస్తారు.. ఇరు రాష్ట్రాలకు ఎలా నచ్చజెప్పుతారు అన్నది చర్చనీయాంశంగా మారింది.
నేడే కృష్ణా బోర్డు సాంకేతిక కమిటీ సమావేశం
కృష్ణా బోర్డు సాంకేతిక కమిటీ సమావేశం బుధవారం(మే 13) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. కేంద్ర జల సంఘం చీఫ్తో పాటు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీకి చెందిన కమిటీ సభ్యులు ఇందులో పాల్గొంటారు. అలాగే ఏపీ, తెలంగాణ అధికారులు కూడా పాల్గొంటారు. కృష్ణా బేసిన్లో మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో సమావేశంలో దానిపై చర్చించనున్నారు.
అయితే మిగులు జలాలపై ట్రిబ్యునల్స్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది ఇప్పటికిప్పుడు జరిగే పని కాకపోవడంతో.. రాష్ట్రాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిర్చే అవకాశం కనిపిస్తోంది. జూన్లో వాటర్ ఇయర్ ప్రారంభానికి ముందు ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి కేంద్ర జల వనరుల శాఖకు పంపించనుంది. ఆ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన కుదిర్చే ప్రయత్నాలు జరగవచ్చు.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై తెలంగాణ అభ్యంతరం
కృష్ణా బేసిన్లోని నికర జలాల్లో ఏపీ, తెలంగాణకు 811 టీఎంసీలను కేటాయించారు. ఇందులో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. అయితే ఏ ప్రాజెక్ట్ నుంచి ఎంత నీటిని వాడుకోవాలి అనే దానిపై నిర్ణయం జరగలేదు. దీంతో సరిహద్దుల్లోని ప్రాజెక్టుల పరిధిలో తమ హక్కు మేరకు ఎక్కడైనా ఈ నీటిని వినియోగించుకునేలా ఒప్పందాలు జరిగాయి.
అయితే మిగులు జలాల విషయంలో లెక్క తేల్చకపోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. తాజాగా రాయలసీమకు నీటిని తరలించాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తుందని ఇక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఎంతవరకైనా వెళ్తాం..
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 203ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కృష్ణా నదిపై ఏ ప్రాజెక్టు మొదలుపెట్టాలన్నా.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు,అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అని గుర్తుచేశారు.
కృష్ణా బోర్డు సాంకేతిక అనుమతిస్తే.. దాన్ని అపెక్స్ కౌన్సిల్ అప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఇవేవీ లేకుండానే ఏపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేశామని.. ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ జగన్తో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు. గతంలో కేవలం 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడును వైఎస్ రాజశేఖర్ రెడ్డి 44వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు వీరంతా ఏం చేసినట్టు అని ప్రశ్నించారు. ఒకప్పుడు కేవలం 4 తూములతో ఉన్న పోతిరెడ్డిపాడును రాజశేఖర్ రెడ్డికి 11 తూములకు పెంచాడని చెప్పారు. ఉద్యమ కాలం నుంచే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని.. దీనిపై ఎంతకైనా పోరాడుతామని స్పష్టం చేశారు.