ప్రపంచ తెలుగు మహాసభలకు కృష్ణమరాజు గైర్హాజర్: ఎందుకంటే...
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ ప్రముఖులను సన్మానించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, బిజెపి నేత కృష్ణం రాజు హాజరు కాలేదు.
తన గైర్హాజరీపై కృష్ణంరాజు వివరణ ఇచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతో పాటు 18వ తేదిన యావత్ చిత్ర పరిశ్రమను ఆహ్వానించి సన్మానించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా అభినందనలు, కృతజ్ఞతలు చెప్పారు.
ఆ కారణంగానే హాజరు కాలేదు..
సినీ ప్రముఖులందరూ హాజరైన ఈ వేడుకకు తాను హాజరు కాలేకపోవడానికి కేవలం సమాచారలోపమే కారణమని కృష్ణంరాజు చెప్పారు. మరే ఇతర కారణాలు లేవని అన్నారు.ప్రపంచ తెలుగు మహాసభలలో కేసీఆర్గారి ప్రారంభోపన్యాసం విన్నప్పుడు తనకు ఎలా అనిపించిందో చెప్పారు.
కృష్ణదేవరాయల మాదిరిగా కెసిఆర్
కృష్ణదేవరాయల పాత్ర పోషించిన తనకు అష్టదిగ్గజాల సమేతంగా స్వయంగా పండితుడై తెలుగు భాషను అత్యున్నత శిఖరాలకు చేర్చిన కృష్ణదేవరాయలు కేసీఆర్లో కనిపించారని కృష్ణంరాజు అన్నారు. కేసీఆర్ వేలాది పుస్తకాలు చదివారని, వేలాది పద్యాలను కంఠత పట్టినారని తనకు తెలుసునని ఆయన అన్నారు.
ప్రారంభోపన్యాసంలో కనిపించింది...
తెలుగు భాష మీద కెసిఆర్కు ఉన్న పట్టేమిటో ఆయన ప్రారంభోపన్యాసంలో కనిపించిందని కృష్ణంరాజు అన్నారు. తెలుగు భాష మీద కేసీఆర్కు గల అభిమానం ఏమిటో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో, తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయడంలో కనిపించిందని కొనియాడారు. ఒకప్పుడు తెలుగు అంటే తమిళంలో కలిసినట్టుగా ఉండేదని, ప్రత్యేకత లేదని అన్నారు.
మహానుభావుడు ఎన్టీఆర్ అలా..
మహానుభావుడు ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రి అయి.. తెలుగు భాషకు, తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారని కృష్ణంరాజు అన్నారు. ఇప్పుడు బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించారని అన్నారు. దీనికి రాజకీయ నాయకుడిగా ఎన్. టి. రామారావుకు, దర్శకుడిగా రాజమౌళి, ఇంత బ్రహ్మాండంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన కేసీఆర్కు, యువనేత కేటీఆర్కు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.