టైమ్ లేదు, ఆరోజు ఇద్దరూ మాట్లాడరు: ఇవీ టైమింగ్స్, 'మెట్రో'పై కేటీఆర్..
Recommended Video
హైదరాబాద్: రాజధాని ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో ప్రయాణానికి సర్వం సిద్దమైంది. ఈ నెల 28న మధ్యాహ్నాం 2.15గం.కు ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు, నాయకులు శనివారం ఉదయం మెట్రోలో ప్రయాణించి సౌకర్యాలను పరిశీలించారు.
మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, పద్మారావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, ఎంపీ మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు మెట్రో రైలులో ప్రయాణించారు.మెట్రోలో ప్రయాణం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఆరోజు ఇద్దరూ మాట్లాడరు:
మెట్రో ప్రారంభం రోజున మియాపూర్ మెట్రో ప్రాంతంలోనే ఒక బహిరంగ సభకు ప్లాన్ చేశామని, అయితే అదేరోజు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ ఉన్నందువల్ల.. సమయాభావం కారణంతో దాన్ని రద్దు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రో ప్రారంభం తర్వాత నేరుగా సదస్సు వెళ్లాల్సి వస్తుండటంతో.. ఆరోజు ప్రధాని గానీ, సీఎం గానీ మాట్లాడే అవకాశాలు లేవన్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రో వివరాలు వెల్లడించేందుకు ఈరోజు మీడియా ముందుకు వచ్చినట్టు తెలిపారు.
మెట్రో స్మార్ట్ కార్డు విడుదల:
మీడియా సమావేశం సందర్భంగా మెట్రో‘టీ సవారీ' స్మార్ట్ కార్డును మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్డు ద్వారా 16రకాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పెట్రోల్, బ్యాంకింగ్, ఆర్టీసీ, ఇలా ఇతరత్రా రంగాల్లో ఈ కార్డు ద్వారా సేవలు పొందవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు.
ఛార్జీలు రేపు ప్రకటించవచ్చు:
మెట్రో ఛార్జీలు ఖరారయ్యాయని వార్తలు వస్తున్నప్పటికీ.. అధికారికంగా మెట్రో అధికారులు రేపు సాయంత్రం వరకు వివరాలు వెల్లడిస్తారని కేటీఆర్ అన్నారు. మెట్రో రైలుకు అన్ని సెక్యూరిటీ సదుపాయాలు ఉన్నాయని, రైలులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఒక్కో కోచ్ లో 330మంది దాకా ప్రయాణించవచ్చన్నారు. రద్దీని బట్టి కోచ్ లను పెంచుతామని తెలిపారు.
టైమింగ్స్:
ఉదయం 6గం. నుంచి రాత్రి 10గం.వరకు ప్రస్తుతం మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు కేటీఆర్. ఆ తర్వాత ఉదయం 5.30గం. నుంచి రాత్రి 11గం. వరకు టైమింగ్స్ పొడగిస్తామన్నారు. టికెట్ లేనివాళ్లను మెట్రో ప్లాట్ ఫామ్ పైకి అనుమతించరని తెలిపారు.
దేశంలో 30 కి.మీల మేర మెట్రో రైలు సేవలను ఒకేసారి ప్రారంభోత్సవం చేయడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన ఎల్&టీ కంపెనీకి కేటీఆర్ అభినందనలు తెలిపారు.