‘మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్’ కెటిఆర్: రిట్జ్, సిఎన్ఎన్-ఐబిఎన్ అవార్డు స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె తారకరామారావు ఆదివారం బెంగళూరులో ప్రతిష్టాత్మక రిట్జ్, సీఎన్ఎన్-ఐబీఎన్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ 2015 అవార్డును స్వీకరించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో లైఫ్ స్టైల్ మేగజైన్ రిట్జ్, సిఎన్ఎన్-ఐబిఎన్ అవార్డును ప్రదానం చేసింది.
దేశంలో ఆయారంగాల్లో విశేషమైన ప్రతిభ కనబర్చినవారిని భిన్న అంశాల ప్రాతిపదికన నిర్వాహకులు విశ్లేషించి అవార్డులకు ఎంపిక చేశారు. ప్రజాజీవితంలో అద్భుతమైన పురోగతి సాధించినవారి కేటగిరీలో మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు.
ఐటీ పరిశ్రమ అభివృద్ధితో పాటు పల్లెసీమల అభివృద్ధికి తనదైన శైలిలో కృషిచేస్తున్న మంత్రి కెటిఆర్కు ఈ విధంగా మరోసారి జాతీయస్థాయి గౌరవం దక్కింది. పరిపాలనలో ఉన్నత ప్రమాణాలు నిలిపి, తెలంగాణ ప్రజలకు విశేష సేవలందిస్తున్న తెలివైన నాయకుడు మంత్రి కేటీఆర్ అని అవార్డుల కమిటీ విశ్లేషించింది. ఆయన ప్రజల అవసరాలపైన అపారమైన జ్ఞానం కలిగి ఉన్న కొత్తతరం రాజకీయ నాయకుడని కమిటీ ప్రశంసించింది.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. పారదర్శకమైన పాలనే ప్రామాణికంగా 18 నెలలుగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన పథకాలు సంతృప్తినిచ్చాయని చెప్పారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలోనే పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ ను హైదరాబాద్లో ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గూగుల్, అమెజాన్, తదితర సంస్థలు హైదరాబాద్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు.