కొడంగల్ బాధ్యత నాది, రేవంత్ రెడ్డి! నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా: కేటీఆర్ సవాల్
Recommended Video
కొడంగల్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో తెరాస నేత, మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ప్రచారం నిర్వహించారు. ఆయన నియోజకవర్గం వేదికగా కేటీఆర్ సవాల్ విసిరారు. భారీ రోడ్డు షోలో ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారని కేటీఆర్ తెలిపారు. 58 ఏళ్ల వృద్ధులకు రూ.2016 పింఛన్ ఇస్తామని చెప్పారు.
ఇద్దరు కాదు.. ముగ్గురు: మళ్లీ రేవంత్ సంచలనం వ్యాఖ్యలు, విశ్వేశ్వర్ రెడ్డి ఊహించని ట్విస్ట్
మళ్లీ అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ.3016 ఇస్తామని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగును నింపుతామన్నారు. ఈ ఎన్నికలు ఆషామాషీ కాదని చెప్పారు. తెరాసను గెలిపిస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని చెప్పారు. పాలన అంటే ఏమిటో ఈ నాలుగేళ్లలో నిరూపించామని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీ తర్వాత పింఛన్లు అన్నీ రెట్టింపు చేస్తామని చెప్పారు.
చేతులు జోడించి చెబుతున్నా.. అవకాశమివ్వండి
చంద్రబాబు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయనకు తెలంగాణతో ఏం సంబంధమని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకప్పుడు పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు ఇక్కడకు ప్రచారానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. పాలమూరుకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొడంగల్లో తెరాసకు అవకాశం ఇవ్వలేదని, నేను చేతులు జోడించి చెబుతున్నానని, లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని, గెలిపించాలన్నారు.
రేవంత్ రెడ్డి చెప్పింది నమ్మి, ఓటేస్తే మోసపోయినట్లే
రేవంత్ రెడ్డి చిల్లరమల్లర మాటలు నమ్మి ఓటు వేయవద్దని కేటీఆర్ అన్నారు. రేవంత్కు ఓటు వేస్తే మోసపోయినట్లే అన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పటికీ కుదరలేదని చెప్పారు. వారు ఓడిపోయే సీట్లు పంచుకున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోయే స్థానాలు పంచుకునేందుకు కిందా, మీదా పడ్డారన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే తెరాసను తిరిగి గెలిపించాలన్నారు. ఆ గట్టు మీద కాంగ్రెస్ ఉంటే, ఈ గట్టుపై తెరాస ఉందని, ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు.
రేవంత్ నా సవాల్ స్వీకరిస్తావా?
ఈ ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రేవంత్ రెడ్డి రాజకీయాలను వదిలేస్తారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. తన సవాల్ స్వీకరిస్తావా అన్నారు. డిసెంబర్ 7న రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషీవి కాదన్నారు. కేసీఆర్ను తిట్టగానే పెద్దవారు కాలేరని చెప్పారు. పొరపాటును ప్రజా కూటమి గెలిస్తే తెలంగాణ ప్రజల జుట్టు చంద్రబాబు చేతిలోకి వెళ్తుందని చెప్పారు.
కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు?
తమ పార్టీ విజయం సాధిస్తే కేసీఆర్ సీఎం అని, మహాకూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లాకు నలుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ గులాంలు, అమరావతి బాద్షాలు తెలంగాణ ప్రజలకు అవసరం లేదని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవరే కాంగ్రెస్లో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందన్నారు. కొడంగల్కు కృష్ణా జలాలు రావాలంటే కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంతోనే సాధ్యం తప్ప ఎవరి వల్లా సాధ్యం కాదని చెప్పారు. కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కృష్ణానది నుంచి సాగునీరు తెచ్చి ఈ ప్రాంత రైతుల కాళ్లు కడిగే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.
కొడంగల్ను సిరిసిల్లలా చేస్తాం
సిరిసిల్ల వలె కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కేటీఆర్ చెప్పారు. సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ వస్తే చీకటేనని కొందరు అపోహలు సృష్టించారని మండిపడ్డారు. ఇది వరకు 200 పెన్షన్ ఇచ్చేందుకు నానా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. మళ్లీ తెరాస అధికారంలోకి వస్తే అన్ని పింఛన్లు రెట్టింపు అవుతాయని చెప్పారు.
సంక్షోభం వైపు ఉంటారా?
కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, అమరావతి బానిసలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావాలా లేక సింహం వంటి కేసీఆర్ కావాలా అని ప్రశ్నించారు. కరెంటు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ వైపు ఉందామా అని ప్రశ్నించారు. సంక్షోభం వైపు ఉందామా, సంక్షేమం వైపు ఉందామా అన్నారు. కొడంగల్కు నీళ్లు కావాలా, కన్నీళ్లు కావాలా అని అడిగారు.