మోడీ జీ! కేంద్రమంత్రులతో అబద్ధాలైనా ఒకేలా చెప్పించండి: కేటీఆర్ సెటైర్లు
కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ ప్రతిపాదనలపై కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.
హైదరాబాద్: కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ ప్రతిపాదనలపై కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. కేంద్రమంత్రులు అబద్ధాలైనా ఒకేలా చెబితే బాగుంటుందంటూ సెటైర్లు వేశారు.

మోడీ జీ.. అబద్ధాలైనా ఒకేలా చెప్పించాలంటూ కేటీఆర్ సెటైర్
తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మోడీ జీ.. కనీసం మీ మంత్రులందరికీ ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రైనింగ్ ఇవ్వండి అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ముగ్గురు కేంద్రమంత్రుల మూడు అబద్ధాలంటూ కేటీఆర్ ఫైర్
కేంద్రమంత్రులు అబద్ధాలాడుతున్నారని, ముగ్గురు కేంద్రమంత్రులు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారన్నారు కేటీఆర్. తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు మంజూరైనట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారని.. మరో కేంద్రమంత్రి మన్సూక్ మాండవీయ మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదంటున్నారని అన్నారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేవలం రెండు ప్రతిపాదనలే వచ్చాయని చెబుతున్నారని.. ఇలా కేంద్రమంత్రులు పరస్పరం పొంతన లేకుండా అబద్దాలాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కిషన్ రెడ్డి అపరమేథావి అంటూ కేటీఆర్ చురకలు
అందుకే కేంద్రమంత్రులు అందరూ ఒకే అబద్ధాన్ని ఒకేలా చెప్పేందుకు ట్రైనింగ్ ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ఉనికిలో లేని 9 మెడికల్ కాలేజీలు ఉన్నట్లుగా క్రియేట్ చేసిన కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. అబద్ధాలు చెప్పిన ముగ్గురు కేంద్రమంత్రుల్లో కిషన్ రెడ్డి అపర మేథావి అని చురకలంటించారు. ఇక హైదరాబాద్ లో గ్లోబల్ మెడికల్ సెంటర్ ఏర్పాటు గురించి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన బూటకమేనని ధ్వజమెత్తారు. కాగా, మెడికల్ కాలేజీలు లేని జిల్లాల పేర్లు పంపమంటే.. అప్పటికే కాలేజీలు ఉన్న కరీంనగర్, ఖమ్మం జిల్లాల పేర్లు ఇవ్వడంతోనే తాము మెడికల్ కాలేజీలు మంజూరు చేయలేకపోయామని నిర్మలా సీతారామన్ తెలిపారు. మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయనే విషయం కూడా కేసీఆర్ కు తెలియదా? అని ఆమె ప్రశ్నించారు. అంతేగాక, 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను హేళన చేస్తూ కేసీఆర్ మాట్లాడటంపై నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. దేశ ప్రజలను జోక్ అంటారా? అని సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వమే భారీగా అప్పులు చేసిందని తెలిపారు.












Click it and Unblock the Notifications