SLBC టన్నెల్ ప్రమాదం: ఓట్ల కోసం రేవంత్ టైముంది.. వాళ్ళ కోసం లేదా?
శ్రీశైలం ఎడమ గట్టు కెనాల్ సొరంగం దుర్ఘటనలో 8 మంది సొరంగంలో చిక్కుకుపోయిన ఘటన రాష్ట్రంలో ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఆ ఎనిమిది మంది జాడ దొరకకపోవడం, వారు సజీవంగా ఉన్నారా లేదా అన్న అనుమానాలకు కారణంగా మారింది. ఇక ఇదే సమయంలో ఈ దుర్ఘటనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి.
రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొరంగం కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని విపత్కర పరిస్థితుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి జరిగిన ఈ దుర్ఘటన పైన సీరియస్నెస్ లేకపోతే అధికార యంత్రాంగానికి మాత్రం ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు.

ఓట్ల వేటకు సీఎం కు సమయం ఉంటుంది
రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుంది అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి టైం ఉంటుంది కానీ ఒక్కసారి క్షతగాత్రుల ఆర్తనాధాలతో మిన్నంటుతున్న ఎస్ ఎల్ బి సి టన్నెల్ కు వెళ్లే టైం లేదా అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ కేటీఆర్ నిలదీశారు.
నోట్ల వేట, ఓట్ల వేట ... ఇదేనా మీ ప్రజా పాలన
ప్రజా పాలన అంటే నోట్ల వేట, ఓట్ల వేట మాత్రమేనా అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. సహాయక చర్యలు ఒక కొలిక్కి రాకముందే ఇరుక్కున్నవారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కార్ చేతులు ఎత్తేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యతను మరవడం ఏమిటంటూ ఆక్షేపించారు .
SLBC టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమే..
— KTR (@KTRBRS) February 24, 2025
రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది ? రెస్క్యూ ఆపరేషన్ ఎలా…
ఎన్నికలే మీ తొలి అజెండానా
ఎన్నికలే తమ తొలి అజెండా అన్న విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. కనీస మానవత్వం కూడా లేకుండా సర్కారు తీరు ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఎస్ఎల్ బీసీ సొరంగం దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications