అవినీతి కంపు, కేటీఆర్ శాఖను పీకేసింది అందుకే.. : భట్టి విక్రమార్క
పాలేరు ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దాన్ని సృష్టిస్తోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. స్థాయి, సంస్కారం మరిచిపోయి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు పాలేరులో టీఆర్ఎస్ పతనానికి నాంది అన్నారు.
కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన భట్టి విక్రమార్క.. వాటర్ గ్రిడ్ ను అంత అద్భుతంగా ఆచరణలో పెడితే, మీ నాయన మీ శాఖను ఎందుకు పీకేశారని ప్రశ్నించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా వాటర్ గ్రిడ్ పై ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పుకుంటున్నప్పుడు ఆ శాఖ నుంచి మిమ్మల్ని ఎందుకు తప్పించారు..? 40 వేల కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి యథేచ్చగా జరిగిపోయినందువల్లే కేటీఆర్ ను ఆ శాఖ నుంచి పీకేశారన్నారు.
పాలేరులో కేటీఆర్ ప్రచారం అవినీతి కంపు కొడుతోందని విమర్శించిన ఆయన, వాటర్ గ్రిడ్ లో జరిగిన అక్రమాల నుంచి కొడుకును రక్షించాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ శాఖను కేసీఆర్ మార్చివేశారని ఆరోపించారు. ఖమ్మ జిల్లా ప్రాజెక్టుల్లోను అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందని, దీని వెనుక కూడా కేటీఆర్ హస్తమే ఉందన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ ను సాకుగా చూపుతూ ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపుగా 10 వేల కోట్ల అవినీతి జరుగుతోందన్నారు.
పాలేరు పోటీని ప్రజల పౌరుషానికి, కేటీఆర్ తుమ్మల అహంకారానికి మధ్య జరుగుతోన్న పోటీగా అభివర్ణించారు భట్టి. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై కూడా విరుచుకుపడ్డ భట్టి విక్రమార్క, నిజంగా తుమ్మల నైతిక విలువలున్న వ్యక్తే అయితే పదవికి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీలోకి దిగాలన్నారు. పాలేరు ప్రజలకు మానవత్వం ఉందని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.