కేటీఆర్కు భారీ ఊరట
KTR: భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్కు భారీ ఊరట లభించింది. ఆయనపై వేర్వేరు పోలీస్ స్టేషన్లల్లో నమోదైన కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తుది తీర్పు వినిపించారు.
గత ఏడాది జూలై 24వ తేదీన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సందర్భంగా కేటీఆర్పై వేర్వేరు పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా డ్రోన్ను ఎగురవేయడం, ఏరియల్ వ్యూ, ఫొటోలు తీయడంపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అక్రమంగా డ్రోన్ను ఎగురవేశారంటూ ఫిర్యాదులు అందాయి.

మేడిగడ్డ కుంగి పోయిన సమయంలో అక్కడి వాస్తవ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తోన్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ నాయకులు బ్యారేజీని సందర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే డ్రోన్ను ఎగురవేశారు.
బ్యారేజీ నుండి నీటిని లిఫ్టు చేయడానికి తగినంత యంత్రాంగం అందుబాటులో ఉన్నప్పటికీ- ఉద్దేశపూరకంగానే ఖరీఫ్కు నీటిని విడుదల చేయట్లేదంటూ అప్పట్లో ఆరోపించారు. పైగా మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగంగా మారిందంటూ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఎదురుదాడికి దిగారు.
డ్రోన్ ఎగురవేత వివాదాలకు దారి తీసింది. అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 2 (8) కింద మేడిగడ్డ బ్యారేజీ నిషేధిత ప్రాంతం కిందికి వస్తుందంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు హైకోర్టులో వాదించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను ఆయన కోర్టుకు సమర్పించారు.
ఈ ఫిర్యాదుల మేరకు పోలీసులు కేటీఆర్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 118/2024 నమోదైంది. ఆయనతో పాటు బీఆర్ఎస్కే చెందిన మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి, బాల్క సుమన్పైనా ఈ కేసులు నమోదయ్యాయి.
వాటిని కొట్టివేయాలంటూ కేటీఆర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, బాల్క సుమన్.. హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించింది. వాదనలను విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి కిందటే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ తుది ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసును కొట్టివేశారు.












Click it and Unblock the Notifications