ఇంత జరిగినా మోడీ స్పందించరా?: కేటీఆర్ సూటి ప్రశ్న
నీట్ యూజీ (NEET UG) ప్రవేశ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేటీఆర్ కోరారు.
విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని, కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని ఆయన తెలిపారు.

కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని కేటీఆర్ విమర్శించారు. ఓవైపు బీహార్లో రూ.30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. మొదట్నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు.
ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోడీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. గ్రేస్ మార్కుల విధానమే లేని చోట ఏకంగా 1563 మందికి గ్రేస్ మార్కులు ఎందుకిచ్చారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించేలా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎన్డీఏ సర్కారుపై ఒత్తిడి తేవాలని కేటీఆర్ కోరారు. నీట్లో జరిగిన అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వారికి న్యాయం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్టీఏ పాత్రపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితో పాటు అక్రమంగా లబ్దిపొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలు ఎన్టీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున తాజా పరిణామాలతో ఎన్టీఏపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. నీట్లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని, వారి తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications