ప్రమాదాలు, విపత్తుల్లో తక్షణ సాయం: డీఆర్ఎఫ్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: నగరాన్ని అన్నింట్లో ముందుంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెడుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మహానగర పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్య అంశమని అన్నారు. నగరంలో విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు హుటాహుటిన స్పందించి సహాయ చర్యలు చేపట్టే ప్రత్యేక దళాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్లోని సచివాలయ సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(డీఆర్ఎఫ్)ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో డీఆర్ఎఫ్ పనిచేస్తుందని కేటీఆర్ వివరించారు.
ప్రతి జోన్కు డీఆర్ఎఫ్ సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు. నగరంలో అన్ని రకాల మౌలిక వసతులు పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించామని తెలిపారు.
MA&UD Minister @KTRTRS launched special vehicles and equipment for @GHMCOnline’s Disaster Response Force. The vehicles and equipment will be used for relief and rescue operations during emergencies. pic.twitter.com/TMeXfXvPXj
— Min IT, Telangana (@MinIT_Telangana) August 4, 2018
పోలీసు యంత్రాంగం, ఫైర్ శాఖలను మరింత బలోపేతం చేసే విధంగా ఈ డీఆర్ఎఫ్ ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుని దీన్ని రూపొందించామని చెప్పారు. నేరాలను నియంత్రిస్తూ హైదరాబాద్ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరితో కలిసి ముందుకువెళ్తున్నామని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీపీ అంజనీకుమార్, తదితరులు పాల్గొన్నారు.