వెంకయ్యతో రహస్యంగా మాట్లాడలేదు: కేటీఆర్, 'పక్కా'గా వెళ్లండి: బాబు
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో తాను రహస్యంగా చర్చలు జరపలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. ఆయన వెంకయ్యతో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిందేమిటో ప్రపంచానికి తెలుసునని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు పని లేక విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
పొద్దుపోక తమ పైన విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వెంకయ్యతో రహస్య చర్చలు జరపలేదన్నారు. ఆయనను అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించామని చెప్పారు. హైదరాబాులో ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని చెప్పారు.

ఏడాదిలో ఒక్క సంఘటన కూడా జరగలేదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాదులో ఆంధ్రా వారికి ఇబ్బందులు తప్పవని గతంలో విమర్శలు చేసిన వారికి ఇది చెంపపెట్టు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పక్కా ఆధారాలు ఉంటే ఆలస్యం చేయవద్దని, తక్షణం నోటీసులు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు ఆదశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ చీఫ్ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధలతో ఆయన భేటీ అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ పైన పోలీసులు సేకరించిన ఆధారాలు పరిశీలించారని సమాచారం. నోటీసులు పంపే ముందు మరోసారి న్యాయనిపుణులతో చర్చించాలని, సలహాలు తీసుకోవాలని సూచించారు.
కేసులో గట్టి ఆధారాలతో ముందుకెళ్లాలని సూచించారని తెలుస్తోంది. మరోవైపు, మత్తయ్య కేసులో ఆయన తెలంగాణ మంత్రులు, అధికారుల పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది, ఏపీ సీఐడీ వారికి నోటీసులు జారీ చేసేందుకు సన్నద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications