అశోక్ గజపతి రాజు వద్ద చేతులు కట్టుకుని కేటీఆర్: అసలు విషయం ఇదే!
న్యూఢిల్లీ: అంశమేదైనా.. తనదైన శైలిలో తెలుగు, ఇంగ్లీష్ ప్రసంగాలతో అందర్నీ ఆకట్టుకోవడమే గాక, ప్రతిపక్షాలపై పదునైన విమర్శలతో విరుచుకుపడే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఆశ్చర్యపరుస్తూ విద్యార్థిలా మారిపోయారు. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ముందు చేతులు కట్టుకుని ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా ఉన్నారు.
అసలు విషయంలో వెళితే.. పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 11వ తేదీ మధ్య హైదరాబాదులో "వింగ్స్ ఇండియా 2018" పేరిట అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖల మంత్రి కేటీఆర్ పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజును కలుసుకుని ఆయనతో కాసేపు మాట్లాడారు.
హుందాగా అశోక్..
విజయనగర సంస్థాన రాజుల వారసుడైన అశోక్ గజపతిరాజు ఆ రాచరిక గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే.. కేటీఆర్ చెప్పేది ఆసక్తిగా ఆలకించారు. అలాగే పెద్దలంటే వినయవిధేయతలు కనబరిచే కేటీఆర్.. ఆయన వద్ద ఉత్తమ విద్యార్థిలా చేతులు కట్టుకుని నిల్చుని అశోక్ చెప్పేది శ్రద్ధగా విన్నారు.
ధన్యవాదాలంటూ కేటీఆర్
ఈ సందర్భంగా ‘వింగ్స్ ఇండియా 2018' సదస్సు కోసం విమానయాన శాఖ హైదరాబాదును వేదికగా చేసుకున్నందుకు అశోక్ గజపతికి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
అశోక్కి మోడీ ప్రశంసకు అభినందనలు
అలాగే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్లమెంటులో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ కూడా పౌరవిమానయాన శాఖ పనితీరును మెచ్చుకోవడంపై కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. ప్రాంతీయ అనుసంధానం, సామాన్యుడికి కూడా గగన విహారం దిశగా విమానయాన శాఖ చేస్తున్న కృషిని మోడీ ప్రశంసించిన సంగతి తెలిసిందే.
మా వంతు సహకారం
హైదరాబాదులో నిర్వహించతలపెట్టిన ‘వింగ్స్ ఇండియా 2018' సదస్సుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా సిద్ధమని కేంద్రమంత్రి అశోక్ గజపతికి కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా, అశోక్, కేటీఆర్ల ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.