నేరుగా నిధులిచ్చే విధానాన్ని సమీక్షించాలి: కెటిఆర్, కేంద్రమంత్రి ప్రశంస, టిఎస్పిఎస్సీకి అవార్డు
న్యూఢిల్లీ: గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిచ్చే విధానాన్ని పునఃసమీక్షించాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్తో మంత్రి కెటిఆర్ సోమవారం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. నేరుగా గ్రామపంచాయతీకి నిధులిచ్చే విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ నిర్వీర్యమవుతోందన్నారు.
ఇతర రాష్ట్రాలతోనూ సంప్రదించి ఓ వేదికపైకి రావాలని కేంద్రమంత్రి తనకు సూచించినట్లు పేర్కొన్నారు. మిగిలిన రాష్ట్రాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు చొరవచూపుతామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. రాబోయే బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఎంపీటీసీ, జడ్పీటీసీల సహాయానికి కృషి చేస్తామన్నారు.
బీఆర్జీఎఫ్ను పూర్తిగా రద్దుచేయలేదని కేంద్రమంత్రి చౌధరి బీరేంద్రసింగ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ అంశంపై విజ్ఞప్తులు వస్తున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో గ్రామ పంచాయతీలకు రూ.2లక్షల కోట్లు వస్తాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలహారం చాలా పెద్దపథకమని, ఈ పథకాన్ని మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా మంచిదని మెచ్చుకున్నారు. ఇలాంటి పథకాలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు.
టీఎస్పీఎస్సీకి స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు
పలు పోటీ పరీక్షలను ఆన్లైన్ ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకుగాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి అరుదైన గుర్తింపు లభించింది. టీఎస్పీఎస్సీని స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డుకు ఎంపిక చేశారు. ఢిల్లీలో డిసెంబర్ 10న జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.